జీవో నెంబర్ 1పై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లోనే విషయం తేల్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు బహిరంగ సభలు, రోడ్ షోలు నిర్వహించుకోవడాన్ని నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ 1 జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ జీవోను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది.
జనవరి 23 కేసు తదుపరి విచారణ జరపాల్సి ఉంది. ఈ లోపునే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్లింది. వెకేషన్ బెంచ్ అత్యవసర కేసుల పేరుతో ప్రభుత్వ విధాన నిర్ణయాలను విచారించరాదని, అయినా రాష్ట్ర హైకోర్టు ఈ విషయాన్ని విచారణకు స్వీకరించి ఆదేశాలు జారీ చేసిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది సి ఎస్ వైద్యనాథన్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.
చీఫ్ జస్టిస్ డి వై చంద్రచూడ్, జస్టిస్ పిఎస్ నరసింహలతో కూడిన బెంచ్ ఈ కేసును విచారిస్తూ తాము ఈ విషయంలో ఈ దశలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు. కేసు విచారణ సోమవారం ఉన్నందున అక్కడే వాదనలు వినిపించాలని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్ర హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తన వాదనలు వినిపించారు.