కోవిడ్ 3వ దశను నియంత్రించేందుకు బహిరంగ ప్రదేశాలలో సంచరించేటప్పుడు ప్రతీ ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ను ధరించాలని విజయనగరం జిల్లా ఎస్పీ దీపిక ప్రజలను కోరారు. విజయనగరం పట్టణంలో గంట స్థంభం జంక్షన్ నుండి కన్యాకా పరమేశ్వరి కోవెల వరకు మార్కెట్ ప్రాంతాలను జిల్లా ఎస్పీ ఎం. దీపిక సాయంత్రం స్వయంగా సందర్శించి, మార్కెట్లో బజారు పనిపై వచ్చిన ప్రజలకు, వ్యాపారులకు కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.
మెయిన్ రోడ్డు, మార్కెట్ ప్రాంతంలో మాస్కు లేకుండా తిరుగుతున్న కొనుగోలు దారులను, చిరు వ్యాపారులను గుర్తించి, వారికి కరోనా నియంత్రణలో మాస్క్ ఆవస్యకతను జిల్లా ఎస్పీ వివరించి, స్వయంగా మాస్కులను అందజేసి, బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించాలని, శానిటైజరు లేదా సబ్బుతో చేతులను తరుచూ శుభ్రం చేసుకోవాలన్నారు.
కరోనా 3వ దశలో వైరస్ వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, కరోనా, ఒమిక్రాన్ వాప్తి నియంత్రణకు ప్రజలంతా సహకరించాలన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మార్కెట్ ప్రాంతాలు రద్దీగా ఉండడం వలన, పోలీసుశాఖ ఆధ్వర్యంలో కోవిడ్ నిబంధనలు గురించి అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రతీ రోజూ మాస్క్ ధరించని వారిపై ఎన్ ఫోర్సుమెంటు కేసులు నమోదు చేస్తున్నామన్నారు.
కోవిడ్ నిబంధనలు పాటించకుంటే షాపుల యజమానులు, షాపింగ్ మాల్స్ పై కూడా చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. పోలీసు అధికారులు, సిబ్బంది ఇప్పటికే కోవిడ్ నిబంధనల పట్ల గ్రామాల్లో ఆటోలతో ప్రచారం చేస్తూ, అప్రమత్తం చేస్తున్నామని జిల్లా ఎస్పీ అన్నారు.
ప్రతీ రోజూ మాస్కు ధరించని వారిపై 600కు పైగా చలానాలు విధిస్తున్నామన్నారు. కోవిడ్ వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రజలంతా సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ ఇళ్లలోనే సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని, బహిరంగ ప్రదేశాలలో ఎవ్వరూ తిరగవద్దని,
కోవిడ్ వాప్తికి కారకులు కావద్దని ప్రజలకు జిల్లా ఎస్పీ ఎం. దీపిక విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సత్యనారాయణ రావు, అనిల్ పులిపాటి, సిఐలు జే.మురళి, సిహేచ్.లక్ష్మణ రావు, ఎస్బి సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐలు అశోక్ కుమార్, దుర్గా ప్రసాద్, దినకర్, రాజేష్ మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.