విజయనగరంలోని గాజులరేగ వద్ద ప్రభుత్వ వైద్య కళాశాల భవనాల నిర్మాణంలో భాగంగా చేపట్టిన వివిధ రకాల నిర్మాణ పనులను, ఇంజనీరింగ్ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఎస్ వైద్య ఆరోగ్య ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నిర్మాణం పనులను వేగవంతం చేసేందుకు అవసరమైన సిబ్బందిని, సామాగ్రిని సమీకరించాలని నిర్మాణ సంస్థకు సూచించారు.
వైద్య కళాశాల నిర్మాణం పనుల పురోగతిని తెలుసుకునే నిమిత్తం జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి కళాశాలను సందర్శించారు. వైద్య ఆరోగ్య మౌలిక సదుపాయాల సంస్థ ఎస్.ఇ. అంకమ్మ చౌదరి, ఇ.ఇ. బి.ఎన్.ప్రసాద్ జిల్లా కలెక్టర్కు నిర్మాణం పనులు జరుగుతున్న తీరును వివరించారు. కార్మికులు భవన నిర్మాణంలో ఎన్ని గంటలు పాల్గొంటున్నదీ కలెక్టర్ తెలుసుకున్నారు. పెయింటింగ్, తరగతి గదుల్లో సీట్ల ఏర్పాటు పనులు, సీలింగ్ పనులు ముమ్మరంగా జరుగుతున్నట్టు వివరించారు. విద్యుదీకరణ, వైరింగ్, తాగునీటి పైప్లైన్లు, ఆడియో వీడియో పరికరాల ఏర్పాటు వంటి అంశాలపైన కలెక్టర్ తెలుసుకున్నారు.
విద్యార్ధులకు అవసరమైన తరగతి గదులు, హాస్టల్ బ్లాక్ల నిర్మాణం గడువులోగా పూర్తిచేస్తామని ఎస్.ఇ., ఇ.ఇ.లు వివరించారు. ఈ సందర్భంగా పలు తరగతి గదుల్లో జరుగుతున్న ఫర్నిచర్ ఏర్పాటు, ల్యాబ్ల పనులను కలెక్టర్ పరిశీలించారు. కళాశాల వరకు రోడ్డు నిర్మాణంపై పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు అంచనాలు రూపొందిస్తున్నట్టు ఇ.ఇ. ప్రసాద్ తెలిపారు. వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా.పద్మలీల, వైద్య కళాశాలకు చెందిన పలువురు వైద్యులు ఈ పర్యటనలో పాల్గొన్నారు.
ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభం కానున్న తరుణంలో ప్రభుత్వ వైద్య కళాశాల భవన నిర్మాణం పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఒకవైపు గోడలకు పెయింటింగ్ పనులు, మరోవైపు భవనం లోపల అవసరమైన ఇంటీరియర్ పనులు నిరంతరాయంగా జరుగుతున్నాయి. జూలై 15వ తేదీ నాటికి పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో పెద్ద ఎత్తున భవన నిర్మాణ కార్మికులను మోహరించి పనులు చేపడుతున్నట్టు ఇ.ఇ. బి.ఎన్.ప్రసాద్ తెలిపారు
ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం జిల్లా