తండ్రి లేని ఒక పేద విద్యార్ధిని వైద్య విద్య చదివించే బాధ్యతను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తీసుకున్నారు. నగరి పట్టణానికి చెందిన బి.చరణ్ తేజ డాక్టర్ అవ్వాలనే లక్ష్యంతో ప్రతిభ చూపి అపోలో మెడికల్ ఇన్ స్టిట్యూట్ అండ్ రిసెర్చి సెంటర్ లో సీటు సంపాదించుకున్నాడు.
ఆయన తండ్రి బి కన్నయ్య మరణించారు. ఆయన తల్లి ఒక ఫొటో స్టూడియో నడుపుతున్నారు. ఆర్ధికంగా వెనుకబడి ఉన్న ఆ కుటుంబం మెడిసిన్ కు ఫీజులు చెల్లించలేని స్థితి ఉంది. ఈ విషయం మంత్రి రోజా తెలుసుకున్నారు. వెంటనే ఆమె చరణ్ తేజను రప్పించి వివరాలు తెలుసుకున్నారు.
అతనికి రూ.95 వేలు ప్రధమ సంవత్సరం ఫీజును చెక్కు రూపంలో అందించారు. ప్రతి నెల రూ.8 వేలు ఖర్చుకు చెల్లిస్తానని, ఐదేళ్ల పాటు అతను మెడిసిన్ పూర్తి చేయడానికి అయ్యే ఖర్చులు పూర్తిగా తాను భరిస్తానని కూడా మంత్రి రోజా తెలిపారు.