హైదరాబాద్ లోని అంబర్ పేట్ వద్ద శ్రీ రమణ థియేటర్ పక్కన ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంబర్ పేట్ మాంకాళి దేవాలయానికి సంబంధించిన మాన్యం భూమిలో ఏండ్ల క్రితం ఈ దేవాలయాన్ని నిర్మించారు.
ఈ దేవాలయ నిర్వహణ పూజాది కార్యక్రమాల బాధ్యతలను అప్పటి పెద్దలు ఇద్దరు సోదరులకు అప్పగించారు. అప్పటి నుంచి దేవాలయ బాధ్యతలను వారే చూసుకుంటూ భక్తులు ఇచ్చే డబ్బులు తీసుకుంటున్నారు. రెండేళ్ల క్రితం నిర్వాహకుల్లో ఒకరు మృతి చెందాడు.
అప్పటి నుంచి చిన్న వాడైన రెండవ వ్యక్తి దేవాలయ బాధ్యతలను చూస్తున్నాడు. సదరు వ్యక్తి దేవాలయంలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నాడని ఆరోపణలు ఉన్నాయి. దేవాలయం ద్వారా వచ్చే సొమ్ముతో ఆ వ్యక్తి సొంత ఆస్తులు పెంచుకుంటున్నాడని కూడా ఆరోపణలు ఉన్నాయి.
అదే దేవాలయం లో ఉంటున్న సోదరుడి కూతురు పై కేసులు పెడుతూ ఆమెను అక్కడి నుండి బయటకు వెళ్లి పొమ్మని ఒత్తిడి చేస్తున్నాడు. దీంతో విసిగిపోయిన ఆమె అంబర్ పేట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దేవాలయ స్థలంలో ఏళ్ల నుంచి అక్రమంగా తిష్ట వేయడమే కాకుండా, దేవుడి సొమ్మును స్వాహా చేస్తున్నాడని కూడా ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది.
ఈ విషయమై అంబర్ పేట దేవస్థాన సేవా సమితి సభ్యులకు ఫిర్యాదు అందడంతో వారు విచారణ జరుదామంటే కూడా అతను సహకరించడం లేదు. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు ఈ విషయంలో జోక్యం చేసుకుని వీరాంజనేయ స్వామి దేవాలయాన్ని పరిరక్షించాలని పలువురు కోరుతున్నారు.
లేనిపక్షంలో దేవాలయాన్ని స్వాధీనపరచు కోవాలని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు వారు తెలిపారు.