విద్యార్థి సంఘాల నాయకులను, ఉద్యోగులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం తగదని కడప జిల్లా రాజంపేట పట్టణంలోని ఆర్ అండ్ బి ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద పి.డి.ఎస్.యు నాయకులు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నూతన జాబ్ క్యాలెండర్ ను రద్దు చేసి అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా వున్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతూ నేడు విద్యార్థి యువజన సంఘాలు, నిరుద్యోగుల ఆధ్వర్యంలో తాడేపల్లి లోని సిఎం నివాసం ముట్టడికి పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా పి డి ఎస్ యు జిల్లా అధ్యక్షుడు నాగేశ్వర మాట్లాడుతూ రాష్ట్రంలో దాదాపుగా 2.30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉండగా కేవలం 10,143 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ ప్రకటించారని అన్నారు. ఇది నిరుద్యోగులకు తీరని ద్రోహమని ఆయన అన్నారు. ప్రస్తుత జాబ్ క్యాలెండర్ రద్దు చేసి నూతన జాబ్ క్యాలెండర్ ను విడుదల చేసి అందులోనే అన్ని శాఖలతో కూడిన పోస్టులు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
గత నెల రోజుల నుండి వివిధ రూపాల్లో నిరుద్యోగుల తో కలిసి ఆందోళన చేస్తుంటే కనీస చలనం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం తగదని వాపోయారు. అంతే కాకుండా ఎన్నికలలో గెలిస్తే రాష్ట్రం లో నిరుద్యోగ శాతం తగ్గిస్తానని మాట పలికి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక చాలీచాలని పోస్టులతో నిరుద్యోగులను నిరాశ పరుస్తున్నారని ఆయన అన్నారు.
ఎన్నికల ముందు వైయస్ జగన్ సర్కార్ నిరుద్యోగులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ విధంగా కక్షపూరితంగా సాధింపు చర్యలు సరైనది కాదని హితవు పలికారు. ఈ సందర్భంగా ఆయన ఆయన చెబుతూ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు భర్తీ చేసేంతవరకు ఈ ఉద్యమాలు ఆగవని అన్నారు.