ఉత్తర కొరియా వరుసగా బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగిస్తూనే ఉన్నది. జపాన్ కు సంబంధించిన సముద్ర భాగంపై అవి పడుతుండటంతో జపాన్ ఈ మేరకు హెచ్చరిస్తూనే ఉన్నది. యోన్హాప్ న్యూస్ ఏజెన్సీ నివేదిక ప్రకారం ఒక క్షిపణి జపాన్ సమీపంలోకి వెళ్లడంతో మధ్య, ఉత్తర ప్రాంతాల నివాసితులు తీవ్ర ఆందోళన చెందారు. ఉత్తర జపాన్లోని మియాగి, యమగటా మరియు నీగాటా ప్రిఫెక్చర్ల నివాసితులు గురువారం భయాందోళనల మధ్యే గడపాల్సి వచ్చింది. ఉత్తర కొరియా ఇప్పటికి 23 క్షిపణులను ప్రయోగించింది.
ఉత్తర కొరియా ఒక్కరోజులో రికార్డు స్థాయిలో 23 క్షిపణులను ప్రయోగించడంతో జపాన్, దక్షిణ కొరియాలో అప్రమత్తమైనాయి. ప్రయోగానికి సంబంధించిన మొదటి సంకేతం వెలువడిన 25 నిమిషాల తర్వాత, జపాన్కు తూర్పున 1,100 కిలోమీటర్ల దూరంలో ఉన్న పసిఫిక్ మహాసముద్రంలో మరో క్షిపణి ల్యాండ్ అయిందని జపాన్ కోస్ట్ గార్డ్ తెలిపింది. జపాన్ మీదుగా క్షిపణి ఎగిరిందని వార్తా సంస్థలు పేర్కొన్నాయి. అయితే, ఈ క్షిపణి జపాన్ భూభాగం మీదుగా వెళ్లలేదని జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఆ తర్వాత పేర్కొంది.
ఉత్తర కొరియా క్షిపణి దక్షిణ కొరియా జలాల సమీపంలో పడటంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఉత్తర కొరియాపై స్పందిస్తూ.. దక్షిణ కొరియా కూడా ఒకదాని తర్వాత ఒకటి మూడు క్షిపణులను ప్రయోగించి తాను కూడా తలవంచబోనని స్పష్టం చేసింది. కొరియన్ న్యూస్ ఏజెన్సీ ప్రకారం, ఉత్తర కొరియా డజను క్షిపణులను ప్రయోగించిన తర్వాత ప్రతిస్పందనగా ఈ క్షిపణిని ప్రయోగించారు. అంతకుముందు, దక్షిణ కొరియా మరియు యుఎస్ విన్యాసాలను చూసిన తర్వాత రెండు దేశాలను “చరిత్రలో అత్యంత భయంకరమైన మూల్యం చెల్లించడానికి” అణ్వాయుధాలను ఉపయోగిస్తామని ఉత్తర కొరియా బెదిరించింది.