జర్నలిస్టు సంతోష్ పై ఆవేశంతో చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పేర్కొన్నారు. జర్నలిస్టులంటే నాకు గౌరవం అని పేర్కొన్నఆయన కబ్జాలతో నాకు సంబంధం లేదన్నారు. అలాంటిది నా పరువుకు భంగం కలిగించే వార్తలు రాశాడని ఆరోపణలకు సంబంధించిన వార్తలు రాసే ముందు వివరణ తీసుకోవడం జర్నలిస్టు ధర్మం అని ఆయన పేర్కొన్నారు.
తన వివరణ కోరకుండానే ఇష్టారీతిన వార్తలు ఎలా రాస్తారని ప్రశ్నించారు. 25 సంవత్సరాలుగా పటాన్చెరు నియోజకవర్గంలో రాజకీయాల్లో ఉన్ననేను ఎప్పుడు ఏ సందర్భంలోను ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్ గా పిలిచే జర్నలిజం గురించి, పాత్రికేయుల పట్ల అమర్యాదగా, చులకనగా మాట్లాడలేదని ఆయన చెప్పుకొచ్చారు.
పాత్రికేయుల పట్ల నేను అనుసరించే వైఖరి ఏ విధంగా ఉంటుందో నియోజకవర్గంలోని పాత్రికేయులతో పాటు, జిల్లాస్థాయి విలేకరులకి సైతం తెలుసని ఆయన అన్నారు.
ఒక దిన పత్రికలో విలేకరిగా పనిచేస్తున్న ఒక వ్యక్తి వాస్తవాలకు విరుద్ధంగా ఒక పార్టీ నాయకుడి చేతిలో కీలుబొమ్మగా మారి తన పరువుకు భంగం కలిగించేలా, నా వివరణ లేకుండా నా ప్రోత్సాహంతో కబ్జాలకు పాల్పడుతున్నారు అంటూ కల్పిత వార్తలు ప్రచురించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
వివాదాస్పదంగా మారిన ఆ భూమి విషయంలో హైకోర్టుకి మైనార్టీ సోదరులకు మధ్య గత 35 ఏళ్లుగా వివాదం ఉన్నవిషయం పైన ప్రాథమిక అవగాహన లేకుండా, నా ప్రోత్సాహంతో షెడ్లు నిర్మించుకున్నారని వార్త రాశారు.
జర్నలిస్టు సంతోష్పై చేసిన వ్యాఖ్యలు కాస్త తీవ్ర దుమారేన్నే రేపడం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడం, తనకు బహిరంగంగా క్షమాపణ చెప్పేవరకూ వదిలేది లేదని సదరు జర్నలిస్టుతోబాటు జర్నలిస్టు సంఘాలు డిమాండ్ చేయడంతో ఎమ్మెల్యే దిగివచ్చి వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటించారు.