తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ప్రజల ప్రాణాలను కాపాడే వైద్యులపై దేశంలో కొన్ని ప్రదేశాలకు చెందిన దుండగులు దాడి చేయడాన్ని పూర్తిగా ఖండిస్తున్నామని డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు. వైద్యులపై జరిగిన దాడిని నిరసిస్తూ ఈ రోజు డాక్టర్ చదలవాడ అరవింద బాబు నరసరావుపేటలోని అమూల్య నర్శింగ్ హోమ్ లో నల్ల కండువా ధరించి ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు నిరసన దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు కరోనా రోగులకు ప్రత్యక్షంగా ప్రాణం పొసే సత్తా వైద్యునికి తప్ప ఎవరికీ లేదని అటువంటి ప్రత్యక్ష దైవ సమానమైన వైద్యులపై కొంతమంది దుండగులు దాడి చేయడాన్ని సహించబోమని అన్నారు.
కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా అందరినీ భయపెడుతున్న క్రమంలో తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా తమ కుటుంబ సభ్యులకు సైతం దూరంగా ఉంటూ సమయానికి తినే పరిస్థితి కూడా ఈరోజు వైద్యులకు లేదని ఇంతటి త్యాగం చేస్తూ రోగుల ప్రాణాలను కాపాడుతున్న వైద్యులు దైవ సమానులని ఆయన అన్నారు.
కనిపించని దేవుడు ఉన్నాడో లేదో తెలియదు గానీ ప్రత్యక్షంగా కనిపించి ప్రాణ భిక్ష పెట్టే వైద్యులు దైవసమానులని అటువంటి వైద్యులపై దాడులకు దిగే వారిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లతో పాటు జీవిత ఖైదు విధించే విధంగా ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని చేయడం ఆహ్వానిస్తున్నామని ఆయన అన్నారు.
లేనిపక్షంలో ఈ సమయంలో ఎక్కడ వైద్యులు అక్కడ దీక్ష చేపడితే రోగులు ఏమైపోతారో అధికారులు ఒక్క నిమిషం ఆలోచించాలని ప్రస్తుత దాడుల ఘటనలలో నిందితులు ఎవరెవరు ఉన్నారో వారిని తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని లేని పక్షంలో వైద్య సంఘాలతో చర్చించి దేశవ్యాప్త ఉద్యమ కార్యచరణ చేపడతామని అరవింద బాబు హెచ్చరించారు.