ఉచితం…. ఉచితం…ఉచితం… ఏ పార్టీ మేనిఫెస్టో చూసినా అన్నీ ఉచితాలే ఉంటాయి. పేదల్ని మరింత పేదలుగా చేసి వారిని ప్రభుత్వం పై ఆధారడే బానిసలుగా చేసే విధంగానే ఎన్నికల హామీలు ఉంటున్నాయి.
ఇలాంటి వాటికి దూరంగా నిజమైన అభివృద్ధి పై దృష్టి సారిస్తూ మక్కల్ నీది మయ్యం (ఎంఎన్ఎం) అధినేత కమల్ హసన్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మేనిఫెస్టోను విడుదల చేశారు.
రానున్న 10 సంవత్సరాలలో తమిళనాడు ఆర్ధిక పరిస్థితిని ఒక ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకువెళ్లడమే ధ్యేయంగా పథకాలు ప్రవేశ పెడతామని ఆయన ప్రకటించారు.
ఇందుకోసం ప్రతి ఏటా 15 నుంచి 20 శాతం ఆర్థికాభివృద్ధి ఉండేలా చూస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రం తలసరి ఆదాయం ప్రస్తుతం 2.76 లక్షలు ఉండగా దాన్ని 7 నుంచి 10 లక్షలకు పెంచడమే ధ్యేయంగా పని చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
జిడిపిలో 6 శాతం విద్యపై ఖర్చు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. గృహిణులకు వారి నైపుణ్యాలను మెరుగుపర్చడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునే అవకాశాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు.
తద్వారా వారు నెలకు రూ.10,000 నుంచి రూ.15,000 వరకు అందుకోగలుగుతారని పేర్కొన్నారు. తమిళనాడులోని ప్రధాన పార్టీలైన ఏఐడీఎంకే, డీఎంకేలు ఇది వరకే మహిళలకు రూ.1,5000, రూ.1.000 ఇస్తామని హామీ ఇచ్చాయి.
50 లక్షల మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఎంఎన్ఎం మేనిఫెస్టోలో కమల్ తెలిపారు. యువ వ్యాపారవేత్తలకు ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలలను అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
విద్యుత్ ఉత్పత్తి, సరఫరా సంస్థలు, రాష్ట్ర రవాణా సంస్థలు నష్టాలను ఎదుర్కొంటున్నాయని కమల్ అన్నారు. నష్టాల బారి నుంచి కాపాడుకునేందుకు ఉద్యోగులనే ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాదారులుగా మార్చాలని అభిప్రాయపడ్డారు.