కల్యాణమస్తు కార్యక్రమంలో పెళ్లి చేసుకునే నిరుపేద జంటలకు రెండు గ్రాముల బంగారు మంగళసూత్రాలను తిరుమల తిరుపతి దేవస్థానం ఇవ్వనుంది.
ఈ మేరకు టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదముద్ర వేసింది. ముందుగా గ్రాము మంగళసూత్రాన్ని ఇవ్వాలని అనుకున్నా తయారీకి ఇబ్బందులు ఎదురవుతుండటంతో టీటీడీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేయాలనుకున్న నిరుపేదలను దృష్టిలో ఉంచుకుని కల్యాణమస్తు కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించింది. రానున్న రోజుల్లో టీటీడీ నిర్వహించే కల్యాణమస్తు కార్యక్రమంలో జంటలకు వీటిని అందించనున్నారు.
నేడు ప్రత్యేక ప్రవేశ దర్శనం ఏప్రిల్ కోటా విడుదల
శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఏప్రిల్ నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శనం టికెట్ల కోటాను శనివారం ఉదయం 9గంటలకు తితిదే ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఏప్రిల్ నెలకు సంబంధించిన అద్దె గదుల కోటాను శనివారం మధ్యాహ్నం 3గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తుంది.