పోడు భూముల పట్టాలు పంపిణీ ప్రక్రియ రెండు రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఐడిఓసి కార్యాలయంలో పోడు పట్టాలు పంపిణీ, కుల వృత్తుల వారికి ఆర్థిక సహాయం దరఖాస్తులు విచారణ ప్రక్రియ పూర్తి చేయుట, రెండవ విడత దళిత బంధు, ఎన్నికల అంశంపై జిల్లా అధికారులు,తహశీల్దార్లు, ఎంపిడిఓ లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 50595 మందికి పోడు పట్టాలు పంపిణీ చేపట్టినట్లు చెప్పారు.
నియోజకవర్గాల వారిగా ఎంపిక చేసిన లబ్ధిదారులకు రానున్న రెండు రోజుల్లో పట్టాలు పంపిణీ పూర్తి చేసి నివేదికలు అందచేయాలని ఎంపీడీఓ లను ఆదేశించారు. లబ్దిదారుల నుండి అక్విడెన్సీ తప్పక తీసుకోవాలని చెప్పారు. కుల వృత్తుల వారికి ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఆర్థిక సాయం అందచేయుటకు 13657 మంది ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసియున్నారని విచారణ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు.
రెండవ విడత దళిత బందుకు నియోజకవర్గానికి 1100 రాబోతున్నాయని మండల ప్రత్యేక అధికారులు, సెక్టార్ అధికారులు, ఎంపిడిఓలు యూనిట్లు ఏర్పాటు పై కసరత్తు ప్రారంభించాలని చెప్పారు. రెండవ విడత గొర్రెల పంపిణీలో ఎంపిక చేసిన లబ్దిదారులకు యూనిట్లు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పారు.
ధరణిలో నూతనంగా చేర్చిన అంశాలపై అధికారులు సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. గ్రామాల వారిగా జాబితా సిద్ధం చేయాలని తహసీల్దార్ లను ఆదేశించారు. పునర్విచారణ చేసి నివేదికలు అందచేయాలని చెప్పారు. ఓటరు జాబితా రూపకల్పనలో ఇంటింటి సర్వే ప్రక్రియ పకడ్బందీగా జరగాలని చెప్పారు.
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరినీ ఓటరుగా నమోదు చేయాలని చెప్పారు. సర్వీస్ ఓటర్లు వివరాలు అప్ డేట్ చేయాలని చెప్పారు. మున్సిపాలిటీలలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన పనులు చేపట్టు ప్రక్రియను వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషర్లను ఆదేశించారు.