హిందూ పక్షపాతిగా పేరు పొందిన శివసేన రాజ్యమేలుతున్న చోట హిందూ సాదువులను వెంటాడి వేటాడి చంపుతారని ఎవరైనా ఊహించగలరా? ఎవరూ ఊహించలేరు. కానీ మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో అత్యంత హేయమైన ఈ సంఘటన జరిగినట్లు ఆలశ్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇద్దరు సాదువులు తమ సహచరుడు చనిపోతే చూసేందుకు సూరత్ బయలు దేరారు. లాక్ డౌన్ కారణంగా పోలీసులు ఆపుతారనే ఉద్దేశ్యంతో ఆ ఇద్దరు సాదువులు ఒక టాక్సీని మాట్లాడుకుని కుగ్రామాల నుంచి వెళ్లేందుకు ఉపక్రమించారు. 70 సంవత్సరాల మహంత్ కల్పవృక్షగిరి, 35 సంవత్సరాల సుశీల్ గిరి మహారాజ్ లు నీలేష్ యల్గడే (30) అనే డ్రైవర్ ను మాట్లాడుకుని అతని కారులో కండవాలీ నుంచి బయలు దేరారు.
వీరు పాల్ఘర్ జిల్లా నుంచి గుజరాత్ లో ప్రవేశించి సూరత్ చేరాల్సి ఉంది. ప్రయాణం మధ్యలో గడ్చించిలే గ్రామం వద్ద అటవీ శాఖ చెక్ పోస్టు వద్ద పోలీసులు ఆపారు. మహంత్ లు ఇద్దరూ కాషాయ వస్త్రాలలో ఉన్నారు. వారు పోలీసులతో మాట్లాడుతుండగానే వెనుకనుంచి ఆ గ్రామానికి చెందిన కొందరు యువకులు వారిని ఎగతాళి చేయడం ప్రారంభించారు.
వారిపై రాళ్లు వేయడం మొదలు పెట్టారు. ఈ లోపు గ్రామం నుంచి మరి కొందరు యువకులు వచ్చి ఆ ముగ్గురిని కర్రలతో కొట్టడం మొదలు పెట్టారు. అక్కడే ఉన్న పోలీసు వారిని ఆపేందుకు కూడా ప్రయత్నించలేదు. పెద్దాయన పోలీసు రక్షణ కోసం వెళ్లినా పోలీసు ఆయనను పక్కకు తోసేశాడు.
దాంతో యువకులు ఇద్దరు మహంతులను కొట్టి చంపారు. డ్రైవర్ ను కూడా అతి కిరాతకంగా చంపేసి పడేశారు. ఈ సంఘటన ఈ నెల 16 వ తేదీ అర్ధ రాత్రి జరిగింది. నేడు ఈ సంఘటన బయటకు వచ్చింది. ఈ ప్రాంతంలో ఇది రెండో సంఘటన. లాక్ డౌన్ సందర్భంగా అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతుంటారనే ఉద్దేశ్యంతో స్థానిక సామాజిక సేవకుడు డాక్టర్ విశ్వాస్ వాల్వి వారం రోజుల కిందట నిత్యావసర వస్తువులు తీసుకుని అక్కడకు వెళ్లాడు.
అప్పుడు కూడా అతడిని అతనితో వచ్చిన యువకులను స్థానికులు తరిమి తరిమి కొట్టారు. దాద్రా నాగర్ హవేలీ సరిహద్దు ప్రాంతమైన ఈ గ్రామంలో పది రోజుల కిందట అదనపు పోలీసు ఎస్ పి వెళ్లినా అక్కడి స్థానికులు ఆయనను కూడా వెంటబడి తరిమి కొట్టారు. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా మహారాష్ట్ర పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.