దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాథ్ తన తండ్రి అంత్యక్రియలకు హాజరు కాలేకపోతున్నారు. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో 23 కోట్ల మంది ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రజల బాధ్యత వదిలేసి తండ్రి అంత్యక్రియలకు వెళ్లలేనని ఆయన తెలిపారు.
ఈ మేరకు ఆయన తల్లికి ఒక సందేశం పంపారు. వీలైనంత తక్కువ మందితో అంత్యక్రియలు నిర్వర్తించాలని తన తల్లిని ఆయన కోరారు. యోగీ ఆదిత్యా నాథ్ తండ్రి ఆనంద్ బిస్త్ నేటి ఉదయం 10.44 గంటలకు ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించారు.
89 సంవత్సరాల ఆనంద్ బిస్త్ కొద్ది రోజుల కిందట జీర్ణాశయ వ్యాధికి సంబంధించిన అనారోగ్యంతో ఆయన ఏయిమ్స్ లో చేరారు. రేపు ఉదయం ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి. తండ్రిని కడసారి చూసుకోవాలని ఉన్నా వెళ్లలేకపోతున్నానని యోగీ ఆదిత్యానాథ్ తెలిపారు. తండ్రి మరణ వార్త తెలిసే సమయానికి ఆయన ఒక అత్యవసర అధికారిక సమావేశంలో ఉన్నారు. తండ్రి మరణ వార్త విన్న తర్వాత కూడా ఆయన సమావేశాన్ని ముగించలేదు. రాష్ట్రంలో లాక్ డౌన్ కచ్చితంగా అమలు జరపాలని, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.