విజయనగరం టూటౌన్ పోలీసు స్టేషనులో నమోదైన ఆలీజాన్ అదృశ్యం కేసును ఛేదించి, హత్యకు గురైన ఆలీజాన్ కేసులో నలుగురు ముద్దాయిలను అరెస్టు చేసారు… టూటౌన్ పోలీసులు. ఈ మేరకు టూటౌన్ పోలీసు స్టేషన్ లో ఇంచార్జ్ డీఎస్పీ శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో.. ఆలీజాన్ అదృశ్యం కేసు… ఆ పై హత్య జరిగిన తీరును..కూలంకషంగా వివరించారు.
ఆలీజాన్ భార్య షేక్ నజీమా విజయనగరం టూటౌన్ పోలీసులకు తన భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేయడంతో, పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసు విచారణ లో భాగంగా మెడికోవర్ ఆసుపత్రి వద్ద నిసి ఫుటేజ్ను పరిశీలించగా, ఆలీజాన్ ను తీసుకొని పొంతపల్లి సురేష్, పడాల సంతోష్ కుమార్, పొంతపల్లి శివ మోటారు సైకిళ్ళపై వెళ్ళినట్లుగా నిర్ధారణ కావడంతో, వారి ముగ్గురిని, గేదెల సన్యాసి నాయుడులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారస్తే తీగలాగితో డొంక కదిలింది.
దీంతో నిందితులు తెలిపిన వివరాల మేరకు ఆలీజాన్ మృతదేహం ఉన్న ప్రాంతానికి చేరుకొని, ఆధారాలు సేకరించి, పంచనామా జరిపి, సగం కాలిన డెడ్ బాడీ ని పోస్టుమార్టం జరిపించామన్నారు. ఈ నెల 15న రాత్రి విజయనగరం కు చెందిన లక్ష్మణరావు అనే వ్యక్తి రింగురోడ్డులోని ఒక బార్ కు వెళ్ళి, మద్యం సేవించి, అక్కడ పని చేసే సిబ్బందితో గొడవ పడడంతో, బార్ మేనేజరుగా పని చేస్తున్న గేదెల సన్యాసినాయుడు, లక్ష్మణరావును కర్ర కొట్టడంతో, అతనికి గాయాలయ్యాయి.
సదరు వ్యక్తిని కొంతమంది విజయనగరం లోని మెడికోవర్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం జాయిన్ చేసారు. గాయపడ్డ లక్ష్మణరావును పరామర్శించేందుకు విజయనగరం గెడ్డవీధికి చెందిన షేక్ ఆలీజాన్ అనే వ్యక్తి మెడికోవర్ ఆసుపత్రికి వచ్చారు. అదే సమయంలో లక్ష్మణరావును గాయపర్చిన విషయంను గేదెల సన్యాసినాయుడు అతని స్నేహితుడైన సొంతపల్లి సురేష్ కు తెలిపి, సహాయం కోరగా, పొంతపల్లి సురేష్ (32 సం.లు, బోయవీధి), అతని తమ్ముడు పొంతపల్లి శివ (30 సం.లు, కొత్తవీధి) పడాల సంతోష్ కుమార్ (29 సం.లు, రౌతువీధి)కి చెందిన వారితో కలసి మెడికోవర్ ఆసుపత్రికి చేరుకున్నారు.
లక్ష్మణ రావును కొట్టిన విషయమై మాట్లాడేందుకుగాను షేక్ ఆలీజాన్ ను తీసుకొని పొంతపల్లి సురేష్ పొంతపల్లి శివ, పడాల సంతోష్ కుమార్ మోటారు సైకిళ్ళపై ధర్మపురి రోడ్డులో లే-అవుట్ వద్దకు వెళ్ళి, మద్యం సేవించారు. ఈ సమయంలో వారి మధ్య గొడవ పెరిగి, ఆలీజాన్ ను పొంతపల్లి సురేష్ మద్యం బాటిల్ పగులగొట్టి బాటిల్ తో కొట్టి, అతని గొంతుపై బాటిల్తో కోయడంతో, ఆలీజాన్ అక్కడికక్కడే చనిపోయాడు.
అనంతరం, ఆలీజాన్ మృతదేహం ను మాయం చెయ్యాలనే ఉద్దేశ్యంతో మోటారు సైకిలుపై ఎక్కించుకొని, ధర్మపురి రోడ్డు మీదుగా, ఐనాడ జంక్షన్ వెళ్ళి, అక్కడ నుండి యూ టర్న్ తీసుకొని సత్యన్నారాయణపురం మీదుగా చిన్నాపురం లే-అవుట్ వద్ద తీసుకొని, పాతిపెట్టాలని భావించారు. అప్పటికే తెల్లవారు కావడం, పశువుల కాపరుల రావడంతో శవంను సురక్షితంగా దాచిపెట్టి, చిన్నాపురం వద్ద సురేష్కు గల మామిడితోటలో బట్టలు తడిపేయడం, చేతులు కడుక్కోవడం చేసారు.
హత్య జరిగిన ధర్మపురి లే-అవుట్ కు వెళ్ళి, అక్కడ హత్య జరిగిన ప్రాంతంలో ఆనవాళ్ళు లేకుండా మట్టి, కారం జల్లినారు. సురేష్ వద్దపని చేసే ప్రసాద్ (తాపీ మేస్త్రి) సంబంధించిన కారులో గేదెల సన్యాసి నాయుడు ను తీసుకొని, మళ్ళీ డెడ్ బాడీ ని మాయం చేయాలని చిన్నాపురం వెళ్ళి, శవంను కారులో ఎక్కించుకొని, దారిలో రోడ్డు ప్రక్కన షాపులో పెట్రోలు బాటిళ్ళు కొనుగోలు చేసి, చిన్నాపురం నుండి పద్మనాభం గ్రామం వైపు వెళ్ళగా, అక్కడ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టడంతో, రేగిడి వైపు కారును మళ్ళించి, కోరాడ, లింగన్నపేట మద్య నిర్మానుష్య ప్రదేశానికి తీసుకొని వెళ్ళి, అక్కడ తోటలో పెట్రోలు పోసి, శవంను కాల్చే ప్రయత్నం చేసారు.
ఈ కేసులో ఇంకనూ దర్యాప్తు చేయాల్సి ఉందని, నిందితులను పోలీసు కస్టడీకి తీసుకొని మరింత లోతుగా విచారణ చేస్తామని డిఎస్పీ తెలిపారు. సగం కాలిన మృతదేహానికి పరీక్ష నిర్వహించామని, డెడ్ బాడీని నుండి సేకరించిన నమూనాలతో డి.ఎన్.ఎ. పరీక్షకు త్వరలో పంపుతామని డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు తెలిపారు. మాయం చేసేందుకు వినియోగించిన గడ్డపార, పార మరియు చనిపోయిన ఆలీజాన్ షర్టును సీజ్ చేసామని డిఎస్పీ తెలిపారు. ఈ మీడియా సమావేశంలో ఎస్ఐ షేక్ శంకర్ మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.