నాగర్ కర్నూల్ జిల్లా 4వ కలెక్టర్ గా జిల్లాకు సేవలు అందించనున్న ఐఏఎస్ అధికారి ఉదయ్ కుమార్ పొగరి. ఆయన 2016 బ్యాచ్ ఐ.ఏ.ఎస్ అధికారి. గంగాధర్ – గంగామణి కుమారుడైన ఉదయ్ కుమార్ మధ్యతరగతి వ్యవసాయ కుటుంబానికి చెందినవారు.
స్వస్థలం నిజామాబాద్ జిల్లా నండిపేట మండలం డొంకేశ్వర్ గ్రామం. తండ్రికి ఉపాధ్యాయ ఉద్యోగం వచ్చాక ఉదయ్ కుమార్ నిజామాబాద్ జిల్లా అంబెడ్కర్ కాలనిలో ఉంటూ ఠాగూర్ విద్యానికేతన్ లో పాఠశాల విద్యాబ్యాసం చేశారు. ఇంటర్మీడియట్ విజయవాడలో చదివి 93 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించారు.
ఐ ఐ టి ఖరగ్ పూర్ లో ఇంజనీరింగ్, ఎంబిఏ పూర్తి చేసి 2014లో రాసిన సివిల్స్ పరీక్షల్లో 677 వ ర్యాంక్ రావడంతో ఐపీఎస్ లో చేరవలసి వచ్చింది. ఐ.ఏ.ఎస్ చేయాలన్న తపన కలిగి ఉన్న ఉదయ్ కుమార్ ఐ.పి.ఎస్ శిక్షణ చేస్తూనే మూడవ సారి రాసిన సివిల్స్ పరీక్షల్లో 234వ అల్ ఇండియా ర్యాంక్ సాధించి ఐ.ఏ.ఎస్ సాధించారు.
సూర్యాపేట లో స్పెషల్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తించిన అనంతరం ఫిబ్రవరి, 2020 లో మున్సిపల్ కమిషనర్ రామగుండం గా బాధ్యతలు స్వీకరించారు. నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ గా ఉత్తర్వులు రావడంతో బాధ్యతలు స్వీకరించనున్నారు.