హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఏ పార్టీ ప్రయత్నించినా ఉక్కుపాదంతో అణచివేయాలని రాష్ట్ర డిజిపిని టిఆర్ఎస్ పార్టీ కోరుతున్నదని వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్ అన్నారు.
నీచమైన కుట్రలకు పాల్పడుతున్న బిజెపి అబద్ధాలు, అసత్యాలు డ్రామాలు, డబ్బులు, అవసరమైతే శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలను ప్రజలకు గుర్తించి జాగ్రత్తగా ఉండాలని ఆయన కోరారు.
తెలంగాణ భవన్ లో నేడు ఆయన మీడియాతో మాట్లాడారు. దుబ్బాకలో ప్రజలను మభ్యపెట్టేందుకు బిజెపి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా భారీ ఎత్తున డబ్బు పట్టుబడుతున్నదని ఆయన అన్నారు.
ఈరోజు కోటి రూపాయలు హైదరాబాద్ టాస్క్ ఫోర్సు పోలీసులు పట్టుకున్నారని కేటీఆర్ తెలిపారు. బీజేపీ డబ్బుల డ్రామా ఫెయిల్ అయిందని ఆయన తెలిపారు.
గోబెల్స్ కి పాఠాలు చెప్పే మాదిరి సామాజిక మాధ్యమాల్లో విస్తృతమైన విషప్రచారాన్ని, దుష్ప్రచారం, అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ అన్నారు.
ఎల్లుండి దుబ్బాక ఎన్నిక కనుక ఈ రోజు చివరి కుట్రకు బిజెపి తెర లేపిందని కేటీఆర్ అన్నారు. హైదరాబాదులో డిజిపి కార్యాలయం లేదా ప్రగతి భవన్, తెలంగాణ భవన్ ముట్టడి పేరుతో తమ చివరి కుప్రయత్నానికి తెరలేపిదన్నారు.
తద్వారా హైదరాబాద్లో లాఠీఛార్జ్, లేదా పోలీసు కాల్పులు జరిపే విధంగా బిజెపి కుట్రలు పన్నుతోందని కేటీఆర్ వెల్లడించారు.
ఈ మేరకు బీజేపీ కుట్రల పట్ల తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎలక్షన్ కమిషనర్ తో పాటు రాష్ట్ర ఎన్నికల అధికారి, రాష్ట్ర డిజిపి కి తమ పార్టీ ప్రతినిధుల బృందం కలుస్తుందని కేటీఆర్ తెలిపారు.