ధరణి పోర్టల్ కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 1620 రిజిస్ట్రేషన్ కేసుల పార్టీలతో సమగ్ర వివరాలను సేకరించి త్వరితగతిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను మంగళవారం నాటికి పూర్తి చేసి తన లాగిన్ కు పంపించాల్సిందిగా నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి తహశీల్దార్లను ఆదేశించారు.
శనివారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయంలో ఆర్డీఓలు, తహశీల్దార్లతో ధరణి పెండింగ్ రిజిస్ట్రేషన్లు లాగిన్ వివరాలపై అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.
రిజిస్ట్రేషన్లకు తహసిల్దార్ కార్యాలయాల్లో ధరణి లాగిన్ లో నిర్ధేశించిన సమయానికి హాజరుకాని కొల్లాపూర్, పెంట్లవెల్లి, లింగాల, పదరా, అమ్రాబాద్, ఉప్పునుంతల మండలాల తహశీల్దార్లకు కు మెమోలు జారీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
తహసీల్దార్ లాగిన్ లలో పెండింగ్ రిజిస్ట్రేషన్ల సమగ్ర వివరాలతో వాటిని పరిష్కరించి కలెక్టర్ లాగిన్ కు పంపించాలని సూచించారు. తహశీల్దార్లు తమ పరిధిలోని పెండింగ్ వివరాలతో, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, తహశీల్దార్లు సకాలంలో లాగ్ ఆన్ కావాలని సూచించారు. ప్రొహిబిటెడ్ ల్యాండ్ కేసు విషయంలో ప్రొహిబిటెడ్ ల్యాండ్ గా ధరణిలో పొందుపరిచిన లేదా ప్రొహిబిటెడ్ నుండి తొలగించాల్సి ఉన్నా చాలా జాగ్రత్తగా పరిశీలించి సిఫారసు చేయాల్సిందిగా ఆదేశించారు.
భూ ఫిర్యాదుల విషయంలో మాట్లాడుతూ ధరణి పోర్టల్ లో మిస్సింగ్ అయిన సర్వే నెంబర్లు, మిస్సింగ్ అయిన భూములు గ్రామ పంచాయతీల వారిగా సేకరించి పోర్టల్ లో పునరుద్ధరణకు సి.సి.యల్ ఏ కు పంపించడానికి సిఫారసు చేయాలని సూచించారు. ప్రతి అంగుళం ప్రభుత్వ భూమిని గుర్తించి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖపై ఉందని తెలిపారు.
ఇందుకు గాను ఆయా గ్రామ పంచాయితీ లో ఏ సర్వే నెంబరులో ఎంత ప్రభుత్వ భూమి ఉందొ రికార్డు చేసి పెట్టుకోవాలని తెలియజేసారు. ఈ సమావేశంలో అందరూ ఆర్డీవో లు, అందరూ తహశీల్దార్లు పాల్గొన్నారు.