కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో గణేష్ నవరాత్రుల నిర్వహణ కోసం మండపాల ఏర్పాటును ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు.
రెండు, మూడు రోజులుగా నిబంధనలతో యథావిధిగా మండపాలు ఏర్పాటు చేసుకోవచ్చని సామాజిక మాధ్యమాలలో వస్తున్న అసత్య వార్తలను నమ్మి మండపాల నిర్వాహకులు ఇబ్బందులకు గురి కావద్దని సూచించారు.
కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో కోవిడ్ నిబంధనలు మరింత కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల ద్వారా మండపాల ఏర్పాటు చేసుకోవచ్చని, ఇందుకోసం కొన్ని నిబంధనలు పాటించాలంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని అలాంటి వ్యక్తులపై ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ.లకు అనుగుణంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా సబ్ డివిజన్ పరిధిలో మండపాల ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలంతా చిన్న చిన్న మట్టి విగ్రహాలను ఇండ్లలో ప్రతిష్టించుకొని భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించుకోవాలని సూచించారు.
పర్యావరణ పరిరక్షణకు మనవంతు బాధ్యత నిర్వహిస్తూ కాలుష్య రహితంగా భావితరాలకు ఆదర్శవంతంగా నిలవాలన్నారు. అదే సమయంలో కరోనాను తరిమికొట్టి ప్రజలంతా సంతోషంగా, ఆరోగ్యవంతంగా ఉండాలని భగవంతుడిని ప్రార్ధించాలని కోరారు.
కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత పరిస్థితులలో కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు మరింత బాధ్యతాయుతంగా ప్రజలంతా పోలీస్ శాఖతో సహకరించాలని ఆయన కోరారు.