ధరణి పేరుతో రైతులను ప్రభుత్వం దగా చేస్తుందని మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ముందు బీజేపీ చేపట్టిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కేసీఆర్ కుట్ర బయటపడిందన్నారు. కేసీఆర్ కనుసన్నల్లోనే సిట్ పని చేస్తుందని కోర్టుకు అనుమానం వచ్చిందని, అందుకే సిట్ దర్యాప్తును రద్దు చేసి సీబీఐకి కేసును అప్పగించిందన్నారు.
సీబీఐ వస్తే పారదర్శకంగా విచారణ జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నందకుమార్, రోహిత్ రెడ్డి ఇద్దరు స్నేహితులని, ఇద్దరు 20 సంవత్సరాలుగా గుట్కా దందాలో భాగస్వాములన్నారు. బీజేపీని అబాసుపాలు చేయడానికి ప్రగతి భవన్ లో స్క్రిప్ట్ తయారు చేశారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయ వేసిందని పేర్కొన్నారు. సీబీఐ విచారణలో అన్ని బయటపడతాయని, ప్రజలు అన్ని తెలుసుకుంటారని చెప్పారు. ఎమ్మెల్యేల కొనుగోలులో బీజేపీ ప్రమేయం లేదని స్పష్టం చేశారు.
నలుగురు ఎమ్మెల్యేలు పావలాకు కూడా పనికిరారని, వీరికి గెలిచే స్థాయి కూడా లేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 57,58 మంది ఎమ్మెల్యేలు కావాలని, ఈ నలుగురితో ప్రభుత్వం ఏర్పాటు చేయడం సాధ్యమేనా..? అని ప్రశ్నించారు. ముందస్తు ఎన్నికలు వచ్చినా.. షెడ్యూల్ ప్రకారం వచ్చినా బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమన్నారు.