పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న అన్ని చర్యలను జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ కు వివరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఘనవ్యర్ధాల నిర్వహణ నియమాల అమలు, బయోమెడికల్ వేస్ట్ , నది ప్రవాహాలలో కాలుష్యం, STP ల నిర్మాణం, వ్యర్థజలాల శుద్దీకరణ తదితర ఆంశాలపై జాతీయ గ్రీన్ ట్రిబ్యూనల్ కు సమర్పించవలసిన నివేదికను ఈ నెల 31 నాటికి సిద్ధం చేయాలని ఆయన అన్నారు.
సోమవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో NGT సమావేశంలో చర్చకు వచ్చే అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్, పంచాయతీ రాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, మెట్రో వాటర్ వర్క్స్ యం.డి దానకిషోర్, పి.సి.బి. సభ్య కార్యదర్శి నీతూ ప్రసాద్ , TSIIC MD వెంకట నర్సింహా రెడ్డి ల తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ జాతీయ గ్రీన్ ట్రిబ్యూనల్ కు సమర్పించవలసిన నివేదికలో, ఇప్పటి వరకు సాధించిన పురోగతి ని పొందుపరుచాలన్నారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ అర్వింద్ కుమార్ మాట్లాడుతూ జాతీయ గ్రీన్ ట్రిబ్యూనల్ ఉత్తర్వుల ప్రకారం కార్యాచరణ ప్రణాళిక అమలు కు తీసుకుంటున్న చర్యలను వివరించారు. గ్రామ పంచాయతీలలో పారిశుద్ద కార్యక్రమాలు, చెత్త సేకరణ తీరును ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ వివరించారు.