ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి కుటుంబ సభ్యులుగా ఉన్న అన్నీ మతాల మధ్య మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలు చిచ్చుపెట్టేలా ఉన్నాయని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్, శ్రీవారి భక్తుడు నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.
అన్యమతస్థులు స్వామివారిని దర్శించుకోవాలంటే డిక్లరేషన్ తప్పని సరి అని ఆయన అన్నారు. మంత్రి నానికి ఈ విషయం తెలియకపోతే ఇప్పుడు ముఖ్యమంత్రి దగ్గరే ఉన్న అజయ్ కల్లాం ను అడిగి తెలుసుకోవాలని ఆయన సూచించారు.
అజయ్ కల్లాం టీటీడీ ఈవోగా పని చేసిన అనుభవం ఉందని, డిక్లరేషన్ ఎందుకు పెట్టారో ఆయనను అడిగి తెలుసుకోవాలని నవీన్ కుమార్ రెడ్డి హితవు చెప్పారు. మంతి కొడాలి నాని చేసిన అహంకారపూరిత వ్యాఖ్యలను ఉపసంహరించుకుని హిందువులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
కొడాలి నాని మంత్రి పదవికి అనర్హుడని ఆయనను తక్షణమే బర్తరఫ్ చేయాలని నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. కొడాలి నాని వ్యాఖ్యలపై స్వరూపానంద స్వామి,చిన్న జీయర్ స్వామి, పరిపూర్ణానంద స్వామి ఇతర మఠాధిపతులు పీఠాధిపతులు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన ప్రశ్నించారు.
“హిందూ ధర్మం పై దాడి” జరుగుతుంటే మఠాధిపతులు పీఠాధిపతులు “దాగుడు మూతలు” ఆడుతున్నారా? అని ఆయన ప్రశ్నించారు. కొడాలి నాని లాంటి వ్యక్తి అహంకార పూరిత మాటల కారణంగా ఏపీ సీఎం కు హిందువులలో అప్రతిష్ట ఏర్పడుతుందని ఆయన తెలిపారు.
కొడాలి నానికి ప్రతిపక్ష పార్టీ నాయకునికి రాజకీయ వైరం ఉంటే మీరు మీరు తేల్చుకోండి అంతే తప్ప హిందూ సంప్రదాయాలను కించపరచకండి వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురి కాకండి హిందువుల సహనాన్ని చేతగానితనంగా చూడకండి అని నవీన్ కుమార్ రెడ్డి అన్నారు.
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో రధానికి ఉన్న వెండి సింహం విగ్రహాల మాయం, అంతర్వేదిలో రథం ఆహుతి, ఆంజనేయస్వామి విగ్రహం చేయి విరగటం లాంటి సంఘటనలు రాష్ట్రంలో పునరావృతం కాకుండా చూసే బాధ్యత ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పైనే ఉందని ఆయన అన్నారు.