మహబూబాబాద్ జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తూ ముందుకు తీసుకు వెళ్లడమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర గిరిజన సంక్షేమం మహిళా శిశు సంక్షేమం శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అధ్యక్షతన మంత్రి ఎల్ ఆర్ ఎస్ రైతు వేదికలు కోవిడ్ లపై మహబూబాబాద్ పార్లమెంటు సభ్యురాలు మాలోత్ కవిత జడ్పీ చైర్మన్ బిందు లతో కలిసి సమీక్షించారు.
తొలుత ఎల్ ఆర్ ఎస్ పై సమీక్షించారు. 75 గజాల లోపు స్థలం లో ఇంటి నిర్మాణానికి స్థలం కొన్నట్టు రిజిస్టర్ పత్రాలు దరఖాస్తుతో అందిస్తే ఒక రూపాయికి అనుమతి లభిస్తుందని మునిసిపల్ కమిషనర్ అన్నారు.
గతంలో 75 గజాల నుండి 500 గజాల లోపు జి ప్లస్ టు క్రింద దరఖాస్తు చేసుకున్న వారికి ముందస్తుగా వెయ్యి రూపాయలు తోనే మొబైల్ ద్వారా గాని మీ సేవ ద్వారా గాని మున్సిపాలిటీ కార్యాలయంలో గాని దరఖాస్తు చేసుకోవచ్చునని అన్నారు.
21 రోజుల గడువులోగా అనుమతులు మంజూరు చేస్తామని తెలియజేస్తూ గతంలో 435 పాత దరఖాస్తులు ఉండగా ప్రస్తుతం 900 దరఖాస్తులు స్వీకరించి నట్టు మున్సిపల్ కమిషనర్ ఇంద్రసేనారెడ్డి మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వులు 58 59 క్రింద దరఖాస్తులు స్వీకరించాలని తమ ప్రభుత్వం ఇదివరకే అవకాశం ఇచ్చింది అన్నారు.
ప్రజల అభ్యర్థన మేరకు ఎల్ ఆర్ ఎస్ విధానంలో విధి విధానాలు ప్రవేశపెట్టి ప్రజలకు సులభతరంగా చేశామన్నారు.