జాతీయ బాల కార్మిక నిర్మూలన సంస్థ (ఎన్.సి.ఎల్.పి)లో నిలుపుదల చేసిన ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆల్ ట్రేడ్ యూనియన్స్ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం శ్రీకాకుళం కలెక్టరేట్ ఎదుట ఎన్.సి.ఎల్.పి.ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ బాల కార్మిక నిర్మూలన సంస్థలో గత పది సంవత్సరాలుగా పని చేస్తున్న ఉద్యోగులను 2019 అక్టోబర్ నుండి అర్ధాంతరంగా నిలిపివేయడంతో వారి కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కార్యాలయం అధికారులు కక్ష సాధింపులలో భాగంగా ఎటువంటి కారణాలు లేకుండా నిలుపుదల చేశారని ఆయన అన్నారు. జిల్లాలో 26 సెంటర్స్ నిర్వాస్తున్నారని, ఎన్.సి.ఎల్.పి.ఉద్యోగులు గత 10సంవత్సరాల కృషి ఫలితంగా 40,000వేల మంది బాలకార్మికులను సర్వే చేసి అనేక మందిని తిరిగి పాఠశాలల్లో చేర్పించి బాల కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపారని అటువంటి వారిని ఇబ్బందులకు గురి చేయడం అన్యాయమని విమర్శించారు.
ఉద్యోగులను నిలుపుదల చేయడం చట్ట వ్యతిరేక చర్య అని అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే జోక్యం చేసుకుని నిలుపుదల చేసిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎన్.సి.ఎల్.పి ఉద్యోగులను విధుల్లోకి తీసుకొని సమస్య పరిష్కారమయ్యే వరకు పోరాటాలు నిర్వహించాలని అన్ని సంఘాలు సంపూర్ణ మద్దతు తెలియచేస్తున్నాయని వారు తెలిపారు. ఈ ధర్నాలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.గోవిందరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు,
ఐ. ఎన్.టి.యూ. సి.జిల్లా అధ్యక్షులు డి.నాగరాజు,వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఈశ్వరమ్మ,జిల్లా కార్యదర్శి జి.సింహాచలం, ఆల్ పెన్షనర్స్&రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శిలు డి.పార్వతీశం, యం.ఆదినారాయణ మూర్తి,
ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు టి.ఆచారి,భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎమ్. హరనాధ్,రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.మోహనారావు,మధ్యాహ్న భోజన పధకం కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి అల్లు.మహాలక్ష్మి,
వి.ఆర్.ఏ.సంఘము జిల్లా నాయకులు ఏ.సత్యనారాయణ, పోరాటానికి మద్దతు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎన్.సి.ఎల్.పి.ఉద్యోగుల సంఘం నాయకులు జె.శ్రీనివాస్, సి.హెచ్.శారదాంబ, కె.శాంతిసాయి, యం.శ్రీదేవి, డి.స్వాతి,యం.శ్రీదేవి పాల్గొన్నారు.