నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.తల్లితండ్రులను అమెరికా పంపించేందుకు చెన్నై ఎయిర్పోర్టు కు వెళ్లి తిరిగి వస్తున్నా ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలయ్యారు. జిల్లా లోని తడ మండలం పన్నంగాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందడం అందులో ఇద్దరు చిన్నారులు ఉండటం అక్కడి ప్రజలని తీవ్రం గా కలిచి వేసింది.
ప్రకాశం జిల్లా దర్శి మండలానికి చెందిన యశ్వంత్ గత కొంతకాలంగా ఒంగోలులోని రైలు పేటలో నివాసం ఉంటున్నారు. నిన్న ఒంగోలు నుంచి కారులో ఇదే కుటుంబానికి చెందిన ఆరుగురు చెన్నై వెళ్లారు. యశ్వంత్ తల్లితండ్రులను అమెరికా పంపించేందుకు చెన్నై ఎయిర్పోర్టులో విమానం ఎక్కించి తిరిగి బయల్దేరారు. శుక్రవారం ఉదయం తడ మండలం పన్నంగాడు వద్దకు రాగానే జాతీయ రహదారిపై ఆగి ఉన్న పాల ట్యాంకర్ను వీరు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో విజయలక్ష్మి (37) అనుసెల్వీ (27) చిన్నారి రియాన్ (ఏడాది) అక్కడికక్కడే మృతి చెందారు. మరో చిన్నారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. యశ్వంత్ (35) ను ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ లు తెలిపారు.