లోక కళ్యాణార్థం అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న టీటీడీ భగవత్ సంకల్పంతో తొలిసారి కార్తీక మాసం మొత్తం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించింది.
వీటిని ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా హిందూ సమాజంలో ఆధ్యాత్మిక భావం పెంపొందించేందుకు దోహద పడతాయని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ పాలక మండలి అభిప్రాయపడింది.
తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం సాయంత్రం టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన ఎస్వీబీసీ 55వ పాలక మండలి సమావేశం జరిగింది.
ఇందులోని ముఖ్యాంశాలు ఇవీ:
1.సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా కార్తీక మాసం ప్రాముఖ్యతను వివరిస్తూ నవంబరు 16 నుంచి డిసెంబరు 14 వ తేదీ వరకు ప్రతి రోజు టీటీడీ నిర్వహించే ప్రత్యేక కార్యక్రమం వీక్షకులను ఆకట్టుకునేలా ప్రసారం చేయాలి.
2. కార్తీక మాసంలో ఏ రోజు ఏ వ్రతం ఎలా చేయాలి, వాటి ఫలితాలు, ఇందుకు సంబంధించిన ప్రవచనాలు, వ్యాఖ్యానాలు వీక్షకులను ఆకట్టుకునేలా రూపొందించాలి.
3. కార్తీకమాస రుద్రాభిషేకం, కార్తీక పురాణ ప్రవచనం, కార్తీక మాసవ్రతం, కార్తీక వన మహోత్సవం, కార్తీక మహాదీపోత్సవం లాంటి కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారం చేయడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలి.
4. ఎస్వీబీసీ కన్నడ, హిందీ చానళ్లు ఫిబ్రవరిలో ప్రసారాలు ప్రారంభించడానికి ప్రాథమికంగా నిర్ణయం.
5. ఇందుకోసం కేంద్ర సమాచార ప్రసారశాఖ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయాలని సీఈఓ కు ఆదేశం.
6. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న సుందరకాండ, విరాటపర్వం, భగవద్గీత కార్యమాలకు అద్భుతమైన రేటింగ్స్ రావడంపై అభినందన.
7. ఎస్వీబీసీని హెచ్ డి ఛానల్ చేయాలి.
ఈ సమావేశంలో ఈఓ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, ఎస్వీబీసీ ఎండి ధర్మారెడ్డి, ఎఫ్ ఏ అండ్ సీఓ బాలాజీ, సి ఈ ఓ సురేష్, ఆచార్య రాణి సదాశివమూర్తి పాల్గొన్నారు.