రానున్న నాలుగైదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీ అన్నారు. ఆదివారం సారంగాపూర్ మండలం లోని స్వర్ణ ప్రాజెక్టును ఏఎస్పీ రాంరెడ్డి, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే లతో కలిసి పరిశీలించారు.
మహారాష్ట్రలో భారీ వర్షాలు కురవడం వలన ప్రాజెక్ట్ లోకి భారీగా వరద నీరు వచ్చిచేరుతుండడంతో వరద గేటును ఎత్తి స్వర్ణవాగులోకి నీటిని విడుదల చేసారు. అనంతరం బైంసా గ్రామీణ మండలం మహాగాంలో చెక్ డ్యాం నిండి వరద నీరు గ్రామంలోకి చేరడంతో వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం గడ్డేన వాగు ప్రాజెక్టులోని వరద నీటిని శాసనసభ్యులు విఠల్ రెడ్డి తో కలిసి కలెక్టర్ కాలువ ద్వారా నీటిని విదుదల చేసారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాల వలన ప్రమాదాలు తలెత్తకుండా ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సమస్యలు తలెత్తే లోతట్టు వంతెనలు, రోడ్లు గుర్తించాలని, చెరువులు, కుంటల నీటి నిల్వలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు.
మధ్య, చిన్న నీటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వ సామర్ధ్యం, వర్షాల వలన నీటి నిల్వలు పెరగడం వంటి వాటిని ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షించాలన్నారు. స్థానిక తహశీల్దార్లు, ఎంపీడీఓలు తమ మండలాల్లో లోతట్టు ప్రాంతాలు గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
సాగునీటి, పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, రెవిన్యూ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, విఆర్ఓ లు, విఆర్ఏ లు, విధిగా స్థానికంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సాగునీటి ఇంజినీరింగ్ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.