అందరికీ దూరమై అవస్థలు పడకుండా అజ్ఞాతం వీడి చికిత్సలు చేయించుకొని కుటుంబ సభ్యులతో కలిసి జీవించాలని అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులకు నిర్మల్ జిల్లా ఇంఛార్జి ఎస్పీ విష్ణు ఎస్ వారియర్ పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లాకు చెందిన అజ్ఞాత దళాలలో పనిచేస్తున్న కంతి లింగవ్వ, ఎర్రి మోహన్ రెడ్డి, తూమ్ శ్రీను, గౌసు భాయి లు ప్రభుత్వానికి లొంగిపోయి జన జీవన స్రవంతిలో కలిస్తే వారిని అన్ని విధాలా ఆదుకుంటామని అన్నారు.
ఈ సందర్భంగా అనారోగ్యంతో బాధ పడుతున్న విషయాన్ని పోలీస్ దృష్టికి తీసుకెళ్లగా ప్రభుత్వానికి లొంగిపోతే మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తానని వారికి సూచించారు. గతంలో మారుమూల గ్రామాల్లో ఎలాంటి సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడేవారని ప్రస్తుతం ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలు కల్పించిందని అన్నారు.
అలాగే సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందడం వల్ల మావోయిస్టుల కదలికలు గుర్తించడం కష్టం కాదని పోలీసులకు పట్టుబ డే వరకు వేచి చూడకుండా ప్రభుత్వానికి లొంగిపోయి కుటుంబసభ్యులతో హాయిగా గడపాలని అన్నారు. గతంలో లొంగిపోయిన వారికి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఎలాంటి అనుమానాలు లేకుండా సరెండర్ కావాలని ఒక ప్రకటనలో నిర్మల్ జిల్లా ఇంఛార్జి ఎస్పీ కోరారు.
ఎస్పీ నిర్మల్, 8332811100, డిఎస్పీ నిర్మల్, 9440795016, ఎస్బీ ఇన్స్పెక్టర్ 8333986938 ఏదైనా సమాచారం ఉంటే ఈ నంబర్లకు సమాచారం ఇవ్వగలరు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచబడుతుంది.