తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లు అనంతపురం నగరంలో జరిగిన అభివృద్ధి శూన్యమని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. అప్పట్లో అభివృద్ధి జరగకుండా వాళ్లు చేసుకున్న విధంగానే ఇప్పుడూ కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజల మద్దతు ఉన్నంత వరకు ఎన్ని కుట్రలు చేసినా అనంతలో అభివృద్ధి ఆగదని స్పష్టం చేశారు. మంగళవారం ఉదయం నగరంలోని 20వ డివిజన్లో కార్పొరేటర్ లావణ్యతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం నిర్వహించారు. సంక్షేమ పథకాలను వివరిస్తూనే స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక సంక్షేమంతో పాటు అభివృద్ధిని శరవేగంగా తీసుకెళ్తున్నట్లు చెప్పారు.
గడప గడపకు వెళ్తున్న సమయంలో ఏళ్ల తరబడి పరిష్కారానికి నోచుకోని సమస్యలను స్థానికులు తన దృష్టికి తీసుకుకొస్తున్నారన్నారు. తప్పకుండా దశలవారీగా అభివృద్ధి పనులు చేయడతామని.. డ్రెయినేజీలు, రోడ్ల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ప్రతి సచివాలయం పరిధిలో రూ.20 లక్షలతో పాటు జనరల్, ప్రత్యేక ఫండ్స్ నుంచి నిధులు కేటాయించి పనులు చేపడతామన్నారు. సంక్షేమం, అభివృద్ధి శరవేగంగా సాగుతుంటే భవిష్యత్లో అధికారంలోకి రాలేమని తెలిసి కుట్రలు చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి జగన్పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ప్రజల సంక్షేమం కోసం చేసిందేమీ లేదన్నారు.
2014లో అధికారంలోకి వచ్చాక విభజన హామీలను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. పోలవరం, ప్రత్యేకహోదా, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక నిధులు సాధించుకునే విషయంలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. ఆనాడు తన వ్యక్తిగత, స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టుపెట్టారన్నారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల వల్ల ఒరిగిందేమీ లేదని తెలిపారు. కార్యక్రమంలో మేయర్ మహమ్మద్ వసీం, డిప్యూటీ మేయర్ వాసంతి సాహిత్య, మార్కెట్యార్డు చైర్మన్ ఫయాజ్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ గౌస్బేగ్, నగర పాలక సంస్థ అడిషనల్ కమిషనర్ రమణారెడ్డి, పలువురు కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు పాల్గొన్నారు.
సత్యం న్యూస్.నెట్, అనంతపురం