జగన్మోహన్ రెడ్డి ఎంత అణచివేయాలని చూస్తే ప్రజలు అంత ఎగసిపడతారు. ఉద్యమం అంత తిరుగుబాటు రాబోతుంది. ఫ్యానుకు ఓటేసిన ప్రజలు కూడా ఇప్పుడు పశ్చాత్తాపపడుతున్నారు. తప్పుల మీద తప్పులు చేస్తున్న జగన్మోహన్ రెడ్డి తన సీటులో కూడా ఇప్పుడు గెలిచే పరిస్థితులు లేవు. హిట్లర్ లాంటి నియంతలే కాలగర్భంలో కలిసిపోయారు అలాంటి నువ్వు ఎంత…? నియంత పాలనను ఆంధ్రప్రదేశ్ ప్రజలు తట్టుకోలేరు. కాబట్టే సమయం కోసం వేచి చూస్తున్నారు.
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవ్వబోయే తీర్పు నీ ఊహకు అందని విధంగా ఉండబోతుంది అంటూ మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తీవ్రంగా విమర్శించారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట లోని తన నివాసంలో మీడియా సమావేశం లో మాట్లాడిన ఆయన జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరుపేదలను మోసం చేస్తూ వారి ఉసురు పోసుకుంటుందని అన్నారు.
గడచిన నాలుగు సంవత్సరాల కాలంగా జగన్మోహన్ రెడ్డి అసమర్ధ పాలన ప్రజల్లో చర్చ జరుగుతుంది. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కూడా ఉంది. అందుకు చంద్రబాబు సభలకు పోటెత్తుతున్న జన సందోహమే నిదర్శనం. జనవరి 27 నుండి నారా లోకేష్ పాదయాత్ర కూడా మొదలు కాబోతుంది. వీటన్నిటిని చూసి జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలైంది. కాబట్టే కొద్ది రోజుల క్రితం జరిగిన కందుకూరు, గుంటూరు ఘటనలను సాకుగా చూపించి బ్రిటిష్ కాలం నాటి చీకటి జీవోను వెలుగులోకి తీసుకువచ్చి ప్రతిపక్షాల మీద వారు చేస్తున్న సభలు ర్యాలీల మీద అక్రమంగా నిషేధం విధించాడు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ విధానాలు, అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలు, వైఫల్యాల మీద ప్రజల్లో చర్చ మొదలైంది. వీటన్నిటిని కప్పిపుచ్చుకోవడానికే జీవో నెంబర్ 1 తో రాజ్యాంగ వ్యతిరేకంగా ర్యాలీలు, సభలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నాడు అని ఆయన విమర్శించారు. ఉన్న ఎమ్మెల్యేలు కూడా జారిపోకుండా వారిని కాపాడుకోవడానికి జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన చీకటి జీవోతో చంద్రబాబు గ్రాఫ్ పెరిగింది ప్రజల స్వేచ్ఛను హరిస్తూ ఎంతైతే జగన్మోహన్ రెడ్డి నిర్బంధం విధిస్తాడు ప్రజల్లో అతని గ్రాఫ్ అంత పడిపోతుంది 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు ప్రచార రథాన్నే సీజ్ చేసావంటే జగన్ రెడ్డికి ఎన్ని గుండెలుండాలి అని ఆయన అన్నారు.