ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకునే సమయంలో మృత్యువు అతన్ని ఆవహించింది. చెరకు ట్రాక్టర్ రూపంలో అతన్ని మృత్యువు తన ఒడికి చేర్చుకుంది. ఈ హృదయ విధారక ఘటన కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. చెరకు లోడ్ తో వెళ్తున్న ట్రాక్టర్ ను వెనకనుంచి వస్తున్న బైకు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకుపై వెళ్తున్న వ్యక్తి తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతుడు కృష్ణాజివాడి గ్రామానికి చెందిన వడ్ల లక్ష్మీపతి(52) గా గుర్తించారు. మృతుడు లక్ష్మీపతి బ్రహ్మణపల్లి గ్రామంలో కార్పెంటర్ పనులు ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే చెరకు లోడ్ తో వెళ్తున్న ట్రాక్టర్ సడెన్ బ్రేక్ వేయడంతోనే ప్రమాదం జరిగినట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.