తెలుగుదేశం పార్టీ తిరుపతి ఉప ఎన్నిక లోక్ సభ అభ్యర్ధి, మాజీ కేంద్ర మంత్రి, డాక్టర్ పనబాక లక్ష్మి, ఆమె భర్త డాక్టర్ పనబాక కృష్ణయ్య దంపతులు బుధవారం హైదరాబాద్ లో టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్ర చంద్రబాబుతో భేటీ అయ్యారు. పనబాక దంపతులతో పాటు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు.
ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుతో పనబాక దంపతులు, సోమిరెడ్డి తిరుపతి ఉప ఎన్నిక వ్యూహంపై సుదీర్ఘంగా చర్చించారు. తిరుపతి ఉప ఎన్నికలకు సంబంధించి అన్ని విధాలా అండగా ఉంటానని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్లు సమాచారం. ఈ నెల 28న, శనివారం తిరుపతిలో పార్లమెంటరీ నియోజకవర్గ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నట్లు పనబాక లక్ష్మి చంద్రబాబుకు తెలియజేశారు. అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పర్యటనకు రంగం సిద్ధం చేస్తున్నట్లు పనబాక దంపతులు వెల్లడించారు.
ఇది ఇలా ఉంటే, చంద్రబాబు నాయుడు తిరుపతి ఉప ఎన్నిక అభ్యర్థి గా పనబాక లక్ష్మీని ప్రకటించిన తరువాత పనబాక కుటుంబంలో వారు శుభ కార్యక్రమంలో బిజీగా ఉంటే ఇంతలోపు కొందరు పనికట్టుకొని లేనిపోని అపోహలకు తెరతీశారు. ఈ అపోహలకు చెక్ పెడుతూ చంద్రబాబు నాయుడు, పనబాక దంపతులు భేటి అన్నిటికీ సమాధానం చెప్పినట్లయింది.