కామారెడ్డి మాస్టర్ ప్లాన్ విషయంలో ఓ రైతు ప్రాణం పోయేదాక ఎమ్మెల్యే, కలెక్టర్ స్పందించరా అని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ప్రశ్నించారు. కలెక్టర్, ఎమ్మెల్యే స్పందనపై మాజీ మంత్రి షబ్బీర్ అలీ స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేసారు. అమాయక రైతు ప్రాణాలు పోయిన తర్వాత వీరికి సోయీ వచ్చిందా అని ప్రశ్నించారు. ఇప్పుడు స్పందించింది ఏదో ముందే స్పందిస్తే ఒక రైతు ప్రాణాలు పోయి ఉండేవి కావు కదా అన్నారు.
ఇప్పటికైనా కళ్ళు తెరిచినందుకు సంతోషమన్నారు. ప్రజలు అన్ని గ్రహిస్తున్నారని, దీనిపై స్పందించకపోతే ఊర్లలో తిరిగే పరిస్థితి లేదనే మీరు స్పందించారన్నారు. ఇప్పుడు మీ కల్లిబొల్లి మాటలు నమ్మేందుకు రైతులు సిద్ధంగా లేరని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ద్వారానో, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ద్వారానో మాస్టర్ ప్లాన్ పై స్పష్టమైన అధికారిక ప్రకటన ఇప్పించాలన్నారు.
రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అధికారికంగా ప్రకటన వచ్చే వరకు ఎవరిని నమ్మేది లేదని, రైతులు ఎవరికి నష్టం లేకుండా సరైన నిర్ణయం వెలువడే వరకు శాంతియుతంగా, న్యాయపరంగా ఎంతవరకైనా పోరాటం చేస్తామని, కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన అండగా ఉంటుందని తెలిపారు.