నవంబర్ 25 న జరిగే పార్లమెంట్ మార్చ్ కరపత్రం సోమవారం నాడు హిమాయత్ నగర్ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యాలయం లో విడుదల చేశారు. ఈ సందర్బంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం 10+2+3కి బదులుగా 5+3+3+4 నూతన జాతీయ విద్యావిధానం తీసుకువచ్చి విద్యను ప్రయివేటీకరణ, కార్పోరేటీకరణ, కాషాయీకరణ చేయడానికి కుట్ర చేస్తున్నారు.
యువతకు స్ఫూర్తి అయిన భగత్ సింగ్, అంబేద్కర్,పెరియార్, నారాయణగురు వంటి వారి జీవిత చరిత్రలను పాఠ్యoశాల నుంచి తొలగించి బ్రిటిష్ వారికీ తొత్తుగా వ్యవహరించిన సావర్కర్ జీవిత చరిత్రను చేర్చి దేశ చరిత్రను వక్రీకరిస్తున్నారు. బాల్యం నుంచే విద్యార్థుల మెదడులో మతతత్వ భావజాలాన్ని నింపుతున్నారు. విద్యార్థుల మధ్య మత విభజన చేయడానికి హిజాబ్ వంటి అంశాలతో రెచ్చగొడుతున్నారు. జోతిష్యం,వాస్తు కోర్సుల పేర్లతో విద్యార్థులలో మూఢనమ్మకాలను పెంచి పోషిస్తున్నారు.
విశ్వవిద్యాలయాల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీయడానికి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పేరుతో పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేస్తున్నారు.మెడికల్ ఎంట్రన్స్ నీట్ ను ప్రాంతీయ భాషలలో నిర్వహించకపోవడం వలన దక్షిణాదిన ప్రతిభ వున్న విద్యార్థులు సైతం నీట్ లో అర్హత సాధించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
తెలంగాణ రాష్ట్ర విద్యార్థులపై మోడీ ప్రభుత్వం వివక్ష చూపిస్తుందని గత 8 సంవత్సరాల కాలంలో ఐఐటి, ఐఐఎం, ట్రిపుల్ ఐటి లాంటి 36 ప్రీమియర్ విద్యాసంస్థలను వివిధ రాష్ట్రాలలో నెలకొల్పిన, తెలంగాణాలో ఒక్క విద్యాసంస్థను కూడా నెలకొల్పలేదని, విభజన చట్టం ప్రకారం ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటు ఇప్పటికి నోచుకోలేదని జిల్లాకొక నవోదయ పాఠశాల ఏర్పాటు చేయాలనీ చట్టం చెపుతున్న ఏర్పాటు చేయలేదని ఖాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమల ఏర్పాటును మోడీ ప్రభుత్వం విస్మరిస్తున్నది. ఈ తరుణంలో ఉపాధి హక్కులను కల్పించడానికి భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయిమెంట్ గ్యారంటీ యాక్ట్ బిల్లును తీసుకు రావాలని నూతన విద్యావిధానం పేరుతో విద్యా కాషాయీకరణ కుట్రలను తిప్పికొట్టడానికి, ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం నూతన జాతీయ విద్యావిధానం 2020 బిల్లును రద్దు చేయాలనీ తదితర సమస్యల సాధనకై ఛలో పార్లమెంట్ మార్చ్ కి పిలుపునివ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గ్యార క్రాంతి కుమార్, రాష్ట్ర నాయకులు ఎండీ అన్వర్, హరీష్, వంశీ,వినోద్, రాజు, శ్రీహరి, వినయ్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.