కోనసీమ ప్రాంతానికి రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ పేరు పెట్టారని.. జిల్లాలకు కొత్త పేర్లు పెట్టేటప్పుడే అంబేడ్కర్ పేరు కూడా పెడితే బాగుండేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుంచి పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు.
ఆనాడే అంబేడ్కర్ పేరు పెట్టి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదన్నారు. జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టడంలో ప్రభుత్వం ఎందుకు జాప్యం చేసిందో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు సాధారణంగా కొంత వ్యతిరేకత ఉంటుందన్నారు. అయితే పేర్లు పెట్టేటప్పుడు ప్రభుత్వం సున్నితంగా వ్యవహరించాల్సిందని పవన్ అభిప్రాయపడ్డారు. గొడవలు జరగాలనే అభ్యంతరాలకు సమయం ఇచ్చారా?
”రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములును ఒక జిల్లాకు కుదించారు. ఆంధ్ర రాష్ట్రానికి గుండెకాయ లాంటి వ్యక్తిని జిల్లాకు పరిమితం చేశారు. కృష్ణా నది తక్కువగా ఉన్న చోట కృష్ణా జిల్లా పేరు పెట్టారు. కృష్ణా నది ఎక్కువగా ఉన్న చోట ఎన్టీఆర్ జిల్లా అని పెట్టారు. జిల్లాల పేర్లకు వ్యతిరేకమైనా.. వ్యక్తులకు వ్యతిరేకం కాదు. మిగతా జిల్లాలతో పాటు కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ అని పెడితే సహజంగా ఉండేది.
అభ్యంతరాలు ఉంటే 30 రోజులు సమయం ఇస్తున్నామన్నారు. మిగతా జిల్లాలకు సమయం ఇవ్వకుండా కోనసీమకే ఎందుకు సమయమిచ్చారు? గొడవలు జరగాలనే అభ్యంతరాలకు సమయం ఇచ్చారా?30 రోజుల సమయమిచ్చి కలెక్టరేట్కు రమ్మని చెప్పారు. సామూహికంగా కాదు.. వ్యక్తులుగా రావాలని సూచించారు. ఇది ముమ్మాటికీ వ్యక్తులను టార్గెట్ చేయడమేనని జనసేన భావిస్తోంది.
30 రోజుల గడువు ఎందుకు? గొడవలు జరగాలని కాదా? మంత్రి విశ్వరూప్ ఇంటిపై దాడి జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఊరుకుంటారా? పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారంటే ఏమనుకోవాలి?దాడి జరుగుతుంటే ఇంటికి రక్షణగా ఉండాలి కదా? విశ్వరూప్ ఇంటిపై దాడికి ముందు మంత్రి కుటుంబసభ్యులను తరలించారు. ముందే తరలించారంటే దాడి జరుగుతుందని పోలీసులకు ముందే తెలుసా?
పోలీసులకు ముందే తెలిసినా బందోబస్తు పెట్టలేదంటే ఏమనాలి?ఘోరాలను ఆపకుండా జరిగేలా చేస్తారా? పైపెచ్చు జనసేనపై ఆరోపణలు చేస్తూ కులసమీకరణపై రాజకీయాలు చేస్తున్నారు. భావోద్వేగాలు ఉంటాయని తెలిసే రెచ్చగొట్టారు” అని పవన్ ఆరోపించారు.