మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు దాదాపు అంతటా హరించిపోయాయి. అందులో పని చేస్తున్న సభ్యులు ఒక్కొక్కరిగా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. మూడు రాష్ట్రాల మావోయిస్టు కార్యదర్శి క్యాతం శ్రీనివాస్ నేడు జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి ఎదుట లొంగిపోయాడు.
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. గత ముప్పై సంవత్సరాలుగా మావోయిస్టు కమిటీలో మూడు రాష్ట్రాలకు కార్యదర్శిగా పని చేసి అనారోగ్య కారణాలతో లొంగిపోయిన మావోయిస్టు సభ్యుడు క్యాతం శ్రీనివాస్ ను మీడియా ముందు హాజరుపరిచారు.
ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ కామారెడ్డి మండలం దేవునిపల్లి గ్రామానికి చెందిన క్యాతం శ్రీనివాస్ తాను చదువుకుంటున్న సమయంలో ఆరెస్ యు కార్యకలపాలలో చురుగ్గా పాల్గొనేవాడని తెలిపారు.
1985 సవత్సరంలో సిరిసిల్లకు చెందిన సతీష్ అనే వ్యక్తి పరిచయంతో పీపుల్స్ వారు గ్రూపుకు చెందిన విషయాలు తెలుసుకుని ఆకర్షితుడైన శ్రీనివాస్ అందులో చేరాడని అన్నారు. అతను ఎక్కడెక్కడ ఎలాంటి స్థాయిలో పని చేసాడో వివరించారు.
లొంగిపోయిన శ్రీనివాస్ ను వివరణ కోరగా మావోయిస్టు కమిటీలో ఉన్న విభేదాల కారణంగా తాను లొంగిపోయానన్నారు. వయసు మీద పడటంతో పాటు ఆరోగ్యం సహకరించకపోవడం కూడా లొంగిపోవడానికి కారణమని చెప్పారు. ఈఆర్బిలో తాను ఇచ్చిన ఫిర్యాదుకు సమాధానం రాకపోవడంతో లొంగిపోయానని చెప్పారు.