జాతీయ రహదారి, 3 రాష్ట్రాల కూడలి, పర్యాటక, వ్యాపార రంగంతో బిజీగా ఉన్నప్పటికీ జిల్లా కేంద్రం అయిన ములుగు లో మూడు నెలలుగా పెట్రోల్ డీజిల్ బంకులు మూతపడి ఉన్నా అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం బాధాకరమని ఎమ్మార్పీఎస్ మహాజన సోషలిస్టు పార్టీ విమర్శించింది. 24 గంటల్లో పెట్రోలు బంకులు తెరవకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. వాహనదారులకు ఇబ్బందులు తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని మహాజన సోషలిస్టు పార్టీ ములుగు నియోజకవర్గ కోఆర్డినేటర్ జన్ను రవి మాదిగ అన్నారు.
ఈ మేరకు ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ (పౌర సరఫరాలు) వై.వి గణేష్ కి వినతి పత్రం అందచేశారు. మాదిగ దండోరా జాతీయ సీనియర్ నాయకులు నెమలి నర్సయ్యమాదిగ మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన ములుగు లో తెలంగాణ రాష్ట్రంలోనే అతిపెద్ద పర్యాటక ప్రదేశ ఉన్నదని గుర్తు చేశారు. జిల్లా కేంద్రం లో ఉన్న రెండు బంకులు పెట్రోలు మూడు నెలలుగా మూతపడి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు.
జిల్లా యంత్రాంగం 24 గంటల్లో జిల్లా కేంద్రంలోని రెండు పెట్రోలు డీజిల్ బంకులను తెరువకుంటే ప్రభుత్వం మీద ఉద్యమం తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, మహాజన సోషలిస్టు పార్టీ ములుగు టౌన్ అధ్యక్షులు మరాఠీ రవీందర్ కొంకరెక్కల స్వామిమాదిగ పోకల సుదర్శన్ మాల మహానాడు రాష్ట్ర నాయకులు బిట్ల కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.