కరోనా కారణంగా లాక్ డౌన్ నడుస్తున్న నేపధ్యంలో పేదలెవరూ పస్తులు ఉండకుండా దాతలు ముందుకు రావాలని చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి అన్నారు. స్వామి రామానంద తీర్థ గ్రామీణ ఉపాధి సంస్థ మాజీ చైర్మన్, విశ్రాంత ఆచార్యులు పట్టణానికి చెందిన ముప్ప నర్సింహారెడ్డి మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులకు మున్సిపల్ కార్యాలయ ఆవరణలో శనివారం రోజున నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ అతి తక్కువ జీతభత్యాలతో ఎక్కువ సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపధ్యంలో ప్రజలకు క్రమం తప్పకుండా వారు తమ సేవలను అందించడానికి ముందు వరుసలో ఉన్నారని, వారిని అభినందించడంతో పాటు ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
కరోనా నివారణలో డాక్టర్లు, పోలీసులు, జర్నలిస్టుల సేవలు వెల కట్టలేనివని అన్నారు. దాత నర్సింహారెడ్డి మాట్లాడుతూ కరోనా రక్కసిని పుడమి నుండి పారద్రోలాడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ప్రజలు సహకరించినపుడే ఇది సాధ్యం అవుతుందని అన్నారు. కూరగాయలను ఉచితంగా పంపిణీ చేసిన మాజీ సర్పంచ్ గుండబోయిన లక్ష్మీ సైదులు మాట్లాడుతూ అనవసర పరిస్థితుల్లో ప్రజలు ఇళ్లు దాటి బయటికి రావద్దన్నారు. మన ఇంటిని, మన ఊరును కాపాడే భాధ్యతను చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కూరేళ్ల లింగస్వామి, కమీషనర్ ఏ ప్రభాకర్, కౌన్సిలర్ సిలివేరు మౌనిక, కోనేటి కృష్ణ, సింగిల్ విండో వైస్ చైర్మన్ మెండే సైదులు, తెరాస నాయకులు బొబ్బల శివశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.