ఎయిరిండియా విమానంలో మహిళపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో మద్యం మైకంలో ఒక వృద్ధురాలిపై నవంబర్ 26న ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేసిన విషయం ఇటీవల వెలుగులోకి వచ్చింది. ఒక వ్యక్తి మూత్ర విసర్జన చేసిన తర్వాత తోటి ప్రయాణీలు అతడిని వారించారు.
విమాన సిబ్బంది అతడిని అక్కడ నుంచి పంపించి వేసి ఆ వృద్ధురాలికి వేరే బట్టలు ఇచ్చారు. అయితే అతడిపై కఠిన చర్యలు తీసుకోలేదు. దాంతో ఆమె ఎయిరిండియా యాజమాన్యానికి ఆమె నేరుగా ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదుపై వెంటనే స్పందించిన టాటా యాజమాన్యం తగిన చర్యలకు ఆదేశించింది. అతడు ఎవరో పసిగట్టిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ ఆరోపణలపై ముంబై నివాసి శంకర్ మిశ్రాను బెంగళూరులోని ఐజీఐ పోలీస్ స్టేషన్ బృందం అరెస్టు చేసింది. అతడిని ఢిల్లీకి తరలించి తదుపరి విచారణ జరుపుతున్నారు.
విచారణ అనంతరం నిందితుడు శంకర్ మిశ్రాను ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టుకు తరలించారు. నిందితుడు శంకర్ మిశ్రాను ఢిల్లీ పోలీసులు మూడు రోజుల కస్టడీని కోరగా, కోర్టు అతడిని 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. అతడిపై ఢిల్లీ పోలీసుల ఆదేశాల మేరకు నవంబర్ 26న ఇమ్మిగ్రేషన్ బ్యూరో లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్ఓసి) జారీ చేసింది. ఎయిర్ ఇండియా నిందితుడిపై 30 రోజుల ప్రయాణ నిషేధాన్ని విధించింది.
నిబంధనల ప్రకారం, అటువంటి ప్రయాణీకుడికి గరిష్ట శిక్షను విధించవచ్చు. ఎయిర్ ఇండియా చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఢిల్లీ పోలీసు అధికారి తెలిపారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ 354, 509, ఇండియన్ ఏవియేషన్ యాక్ట్ సెక్షన్ 23 కింద కేసు నమోదు చేశారు.