రాంగోపాల్ వర్మ నిర్మించబోయే మర్డర్ సినిమాపై ప్రణయ్ తండ్రి బాలస్వామి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పాటు ఆయన నిర్మించబోయే సినిమా తన కొడుకు హత్య కేసును తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశం ఉన్నదని ఆయన నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టులో ఆయన ఫిర్యాదు దాఖలు చేసినట్లు ఎస్పీ తెలిపారు.
దీనిపై స్పందించిన నల్లగొండ ఎస్సీ ఎస్టీ కోర్టు రామ్ గోపాల్ వర్మ, నిర్మాత నట్టి కరుణలపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసిందని, కోర్టు ఆదేశాల మేరకు మిర్యాలగూడ వన్ టౌన్ సిఐ సదా నాగరాజు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మతో పాటు మర్డర్ సినిమా నిర్మాత నట్టి కరుణ ఇద్దరిపైన కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ రంగనాధ్ తెలిపారు.
లేనిపోని సబ్జెక్టులు తీసుకుని సంచలనం పేరుతో సినిమాలు తీసే రామ్ గోపాల్ వర్మ మర్డర్ సినిమాను ఇకనైనా ఆపుతాడా లేదా అనే చర్చ మొదలైంది. రాజకీయ అంశాలతో బాటు అమృత కేసుపైనా, దిశ కేసు ఎన్ కౌంటర్ లో చనిపోయిన వ్యక్తి భార్య పైనా రామ్ గోపాల్ వర్మ సినిమాలు తీయడం ప్రారంభించాడు.
ఇప్పటికే రెండు శృంగార చిత్రాలు తీసిన రామ్ గోపాల్ వర్మ ఇలాంటి వివాదాస్పద చిత్రాలు తీస్తూనే ఉన్నాడు. తాజాగా ఎస్సీఎస్టీ కోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో ఇక నైనా రామ్ గోపాల్ వర్మ ఇలాంటి చిత్రాలు తీయడం ఆపుతాడా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.