ఏ రంగంలోనైనా కష్టపడి పని చేసినప్పుడే అందుకు తగిన గుర్తింపుతో పాటు ఉన్నత స్థానాలకు చేరుకోగలమని నల్లగొండ జిల్లా అదనపు ఎస్పీ సి.నర్మద అన్నారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు జయరాజ్ అధ్యక్షతన జరిగిన పదవీ విరమణ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఎన్నో రకాల త్యాగాలతో పాటు కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజలకు సేవలందించడం ఎంతో గర్వకారణమన్నారు.
పోలీస్ వృత్తి ద్వారా న్యాయం కోసం ఎదురు చూసే బాధితులకు అండగా నిలిచే అవకాశం కలుగుతుందన్నారు. ప్రతి ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ తప్పదని అయితే ఉద్యోగ విరమణ తర్వాత ఖాళీగా ఉండకుండా ఎదో ఒక వ్యాపకంతో సమజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు.
పదవీ విరమణ చేసిన వారి సేవలు అపురూపం
ఎక్కడ ఉన్నా పోలీస్ శాఖ గౌరవాన్ని ప్రజలలో మరింత పెంచడం, ప్రజలకు పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని పెంపొందించేలా రిటైర్డ్ పోలీస్ ఉద్యోగులు చూడాలని ఆమె కోరారు. సుమారు 35 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన అధికారుల సేవలను ఆమె ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వారి అనుభవం, సేవలు భవిష్యత్ తరాలకు ఎంతో స్ఫూర్తిగా నిలుస్తాయని ఆమె చెప్పారు.
డిటిసి అదనపు ఎస్పీ సతీష్ చోడగిరి మాట్లాడుతూ పదవీ విరమణ అనేది ఉద్యోగ జీవితంలో చాలా ముఖ్యమైన సందర్భమని ఆయన చెప్పారు. పిల్లలకు మంచి విద్య అందించడం, ఆరోగ్యాలను రక్షించుకోవడం చాలా ముఖ్యమని ఆయన అన్నారు. ప్రతి పోలీస్ విధి నిర్వహణలో సమర్ధవంతంగా పని చేస్తున్న అంశాన్ని స్ఫూర్తిగా తీసుకుని వారి పిల్లలు జీవితంలో మంచిగా స్థిరపడే అవకాశం కలుగుతుందని ఆయన చెప్పారు.
సుఖ సంతోషాలతో శేష జీవితం గడపాలి
పదవీ విరమణ పొందిన అధికారులు భావి జీవితాన్ని సంతోషంగా గడపాలని ఆయన సూచించారు. పదవీ విరమణ పొందిన డిటిసి డిఎస్పీ ప్రతాప్ రెడ్డి, సిఐ యూసుఫ్ అలీ, ఎస్.ఐ.లు రవీందర్ రెడ్డి, అబ్దుల్ లతీఫ్, ఏ.ఎస్.ఐ. కె.సోమిరెడ్డి, ఏ.ఆర్.ఎస్.ఐ.లు ఖాజా లతీఫుద్దీన్, లక్ద్మీ నారాయణ, మహమ్మద్ హుస్సేన్, హెడ్ కానిస్టేబుల్స్ జానీ పాషా, వేణు గోపాల్ రెడ్డి, డిపిఓ సీనియర్ అసిస్టెంట్ అబ్దుల్ జవేద్ లను శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించి అభినందించారు.
ఈ కార్యక్రమంలో డిటిసి అదనపు ఎస్పీ సతీష్ చోడగిరి, డిఎస్పీ ప్రతాప్ రెడ్డి, డిపిఓ ఏ.ఓ. మంజు భార్గవి, పోలీస్ అధికారుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు జయరాజ్, రాష్ట్ర నాయకులు సోమయ్య, డిఎస్పీ రమణా రెడ్డి, సూపరింటెండెంట్లు అతిఖుర్ రెహమాన్, దయాకర్, సబితా రాణి, సిఐ నాగేశ్వర్ రావు, బాషా, డిపిఓ సిబ్బంది జమీల్, గౌస్, రాజు, లియాఖత్, రాజుతో పాటు పదవీ విరమణ పొందిన అధికారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.