తనపై వచ్చిన ఆరోపణలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేస్తారని చాలా మంది ఊహించారు.
అయితే ఈటల రాజేందర్ అందుకు భిన్నంగా రియాక్ట్ అయ్యారు. విచారణకు తాను సిద్ధమేనని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాల్ విసిరారు.
విజిలెన్స్ విచారణ కాదని సిట్టింగ్ జడ్జి నుంచి సీబీఐ వరకూ ఏ విచారణ అయినా చేసుకోవచ్చునని ఆయన సవాల్ విసిరారు.
దాంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశం లేనట్లు కనిపిస్తున్నది.
ఆయనను మంత్రి వర్గం నుంచి సాగనంపేందుకు ప్లాన్ చేసిన వారి ఆశలు వమ్ము చేస్తూ ఈటల రాజేందర్ రాజీనామాకు ససేమిరా అంటున్నారు.
అయితే ఈటల రాజేందర్ పై విజిలెన్స్ విచారణ జరిపి తక్షణ నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
అందువల్ల విజిలెన్స్ ప్రాధమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది.
ఇప్పటికే టీఆర్ఎస్ కు చెందిన ఛానెల్ లో అన్ని అంశాలతో వార్తలు ప్రచారం చేసినందున విజిలెన్స్ నివేదిక అదే తరహాలో వచ్చే అవకాశం ఉంది.
విజిలెన్స్ నివేదికలో మంత్రిపై ఆరోపణలు ఖరారైతే తుది నివేదిక వచ్చే వరకూ కూడా ముఖ్యమంత్రి వేచి ఉండాల్సిన అవసరం ఉండదు.
ప్రాధమిక నివేదిక ఆధారంగా మంత్రి ఈటలను బర్తరఫ్ చేసే అవకాశం కనిపిస్తున్నది.