తన ఆస్తులపైనా, వచ్చిన ఆరోపణలపైనా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
మెదక్ జిల్లా మూసాయిపెట్, అచ్చంపేట లో 100 ఎకరాల అసైన్డ్ భూమిని నిరుపేదల నుండి మంత్రి ఆక్రమించుకున్నడని టీఆర్ఎస్ పార్టీకి చెందిన అధికార న్యూస్ ఛానెల్ లో వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు.
తనకు ఆస్తులు, పదవుల కన్నా ఆత్మగౌరవం అని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ గడ్డపై చాలా మంది వందల కోట్లు అక్రమంగా సంపాదించారని వారి పై విచారణ చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. నా ఆస్తులన్నింటిపైనా విచారణ వేయాలని డిమాండ్ చేస్తున్నా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.
పదవి గడ్డిపోచతో సమానం. నా ఆత్మగౌరవం కన్నా ఈ పదవి గొప్పది కాదు. ప్రలోభాలు పెట్టి గెలవలేదు. ఎవడి చరిత్ర ఏమిటో నాకు తెలుసు. నీ ఛానెల్ ను పాతరేస్తా అని ఆయన హెచ్చరించారు. తన పై ఆరోపణలు వచ్చిన భూమి విషయం ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెప్పానని ఆయన తెలిపారు.
అదే విధంగా ముఖ్యమంత్రి కార్యదర్శి నర్సింగరావుకు ముందే చెప్పానని మంత్రి అన్నారు. ముందస్తు ప్రణాళికతో, స్కెచ్ వేసుకుని నా వ్యక్తిత్వాన్ని కించపరిచే ధోరణితో వార్తలు వేశారని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. అసైన్డ్ భూములను కబ్జా చేసినట్లు ఆరోపణ చేశారు.
అత్యంత దుర్మార్గమైనది. న్యాయానికి తాత్కాలికంగా అపజయం కలిగి ఉండవచ్చు అని ఆయన అన్నారు. 2016లో ఒక హేచరీ పెట్టానని దాని కోసం కెనరా బ్యాంకు ద్వారా వంద కోట్ల రూపాయల రుణం తీసుకున్నామని తెలిపారు.
రాళ్లు రప్పలుతో నిండి ఉన్న భూమిని తాను ప్రభుత్వానికి తిరిగి అప్పగించి ప్రభుత్వం నుంచి కేటాయించుకునేలా చేసుకుందామనుకున్నారని ఆయన అన్నారు. ఆరోపణలు వచ్చిన 20 ఎకరాల ల్యాండ్ ను ఇప్పటికీ యజమానులే అనుభవిస్తున్నారని, తమ స్వాధీనంలో లేదని ఆయన అన్నారు.