విజయనగరం జిల్లాలో పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సెక్షను 30 పోలీసు చట్టం 1861ను జిల్లా వ్యాప్తంగా అమలు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీరాజకుమారి తెలిపారు. పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు అన్ని ముందస్తు చర్యలు చేపడుతున్నామన్నారు.
ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించు కొనేందుకు, ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా ఉండేందుకు అన్ని కఠిన చర్యలు చేపడుతున్నామన్నారు. గ్రామాల్లో చిన్న చిన్న తగాదాలు శాంతిభద్రతల సమస్యగా మారే అవకాశం ఉన్నందున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటున్నా మన్నారు.
ఎన్నికల ప్రవర్తనా నియమాళి అమలులో ఉన్నందున ఎవరు ఏ కార్యక్రమం చేపట్టినా ఎన్నికల నిబంధనలకు కట్టుబడి ఉండాలన్నారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు, ప్రచార వాహనాలకు అనుమతులు తప్పనిసరిగా సంబంధిత పోలీసు అధికారి నుండి లేదా రిటర్నింగు అధికారి నుండి తీసుకోవాలన్నారు.
ఏ కార్యక్రమం చేపట్టాలనుకున్నా ఎప్పుడు, ఎక్కడ, ఎంత సమయానికి చేపడుతున్నదీ పోలీసులకు ముందుగా తెలిపాలని ఎస్పీ సూచించారు. ఇక పోలీసులు సూచించిన ఆంక్షలకు కట్టుబడి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అలా కాకుండా, నియమాలను అతిక్రమించి ఆంక్షలను ఉల్లంఘించిన చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.
ఎట్టి పరిస్థితుల్లోను ఎన్నికల ప్రవర్తనా నియమా వళిని ఉల్లంఘించరాదని, ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తే వారిపై సెక్షను 30 పోలీసు చట్టం ప్రకారం ప్రాసిక్యూట్ చేస్తామని జిల్లా ఎస్పీ రాజకుమారి హెచ్చరించారు.