నల్గొండ ఫ్లోరైడ్ ముఖచిత్రంగా దేశవ్యాప్తంగా అందరికీ సుపరిచితులైన నల్గొండ ఫ్లోరైడ్ బాధితులు అంశాల స్వామికి సొంత ఇల్లు చేకూరనుంది. గతంలో అంశాల స్వామి జీవనాధారం కోసం ప్రత్యేకంగా ఒక షాప్ (హెయిర్ కటింగ్ సెలూన్) ని ఏర్పాటు చేయించిన మంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వహక అధ్యక్షులు కే తారకరామారావు ఈరోజు అంశాల స్వామికి ఒక పక్కా ఇల్లుని అందించనున్నట్లు తెలిపారు.
ప్రభుత్వం వైపు నుంచి అంశాల స్వామికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మంజూరు చేయాలని స్థానిక జిల్లా కలెక్టర్ కి ఆదేశాలు జారీ చేసిన మంత్రి కేటీఆర్, ఈరోజు పార్టీ సీనియర్ నాయకులు కర్నాటి విద్యాసాగర్ కు అంశాల స్వామికి ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యత తీసుకోవాలని సూచించారు.
మంత్రి కె.తారక రామారావు జన్మదినం సందర్భంగా ప్రారంభించిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా తన సొంత ఊరు పరిసర గ్రామ నివాసి అయిన అంశాల స్వామికి పక్కా ఇల్లు అందించేందుకు విద్యాసాగర్ ముందుకొచ్చారు. ఈమేరకు అంశాల స్వామి మంత్రి కేటీఆర్ ని ప్రగతిభవన్లో ఈరోజు కలిశారు.
ఈ సందర్భంగా అంశాల స్వామికి సంబంధించిన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న మంత్రి, ఆయనకు పక్కా ఇంటి నిర్మాణానికి సంబంధించిన పూర్తి భరోసా ఇచ్చారు.
ఈ మేరకు స్వామి ఇల్లు నిర్మాణం పూర్తయ్యేంత వరకు సంపూర్ణ బాధ్యత తీసుకోవాలని విద్యాసాగర్ కి సూచించారు. విద్యాసాగర్ కి సొంత ఇంటి నిర్మాణ బాధ్యత తీసుకొనేందుకు ముందుకు వచ్చిన విద్యాసాగర్ ని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా అభినందించారు.
గతంలోని తన జీవనం సాగేందుకు ఎలాంటి ఇబ్బంది రాకుండా తగిన ఏర్పాట్లు చేసిన మంత్రి కేటీఆర్, ఇప్పుడు తన సొంత ఇంటి కల నెరవేర్చుతునందుకు అంశాల స్వామి, మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.
ఇప్పటికే మిషన్ భగీరథ ద్వారా ఫ్లోరైడ్ సమస్య నుంచి క్రమంగా విముక్తి లభిస్తుందని స్వామి అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుని కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతానని అంశాల స్వామి అన్నారు.