వనపర్తి జిల్లాలో ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం ఐ.డి ఒ సి ప్రజావాణి హాల్లో ఆర్డీవో పద్మావతి, జడ్పి సి. ఈ. ఒ రామ మహేశ్వర రెడ్డి తో కలిసి ప్రజావాణి ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా శాఖలకు సంబంధించిన ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా వెనువెంటనే పరిష్కరించి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. ఈ రోజు ప్రజావాణికి మొత్తం 60 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.
రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి ఖాజా ఖతుబుద్దిన్ చేసిన సేవలు చిరస్మరణీయమనీ అదనపు కలెక్టర్ కొనియాడారు. ఫిబ్రవరి 6 న మరణించిన ఖుతుబుద్దిన్ 2002 లో తహశీల్దార్ గా ఉద్యోగ విరమణ చేసి అప్పటి నుండి ఉమ్మడి జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా తన సేవలు కొనసాగించారు. వనపర్తి జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శిగా తన సేవలు సుదీర్ఘ కాలం అందించారు.
సోమవారం ఉదయం ప్రజావాణి ప్రారంభం కాకముందు ఉద్యోగులు అందరూ కుతుబుద్దిన్ ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. ప్రజావాణి అనంతర కుతూబుద్దిన్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. జిల్లా అధికారులు, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు నివాళులర్పించిన వారిలో ఉన్నారు.
పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్