కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో కోమాలో ఉన్న రోగిని ఎలుకలు కరిచిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై స్పందించిన ప్రభుత్వం నిన్న ఉదయం రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ డా. అజయ్ కుమార్ ను విచారణ నిమిత్తం జిల్లా ఆస్పత్రికి పంపించింది. కమిషనర్, జిల్లా కలెక్టర్ నివేదికతో సాయంత్రం లోపు ఘటనకు బాద్యులను చేస్తూ అసోసియేట్ ప్రొఫెసర్, జనరల్ మెడిసిన్ డాక్టర్ వసంత్ కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ఐసియు ఇంచార్జి డా.కావ్యతో పాటు స్టాఫ్ నర్స్ మంజులను సస్పెండ్ చేస్తూ డిఎంఈ త్రివేణి ఉత్తర్వులు జారీ చేశారు.
అలాగే విచారణ పూర్తయ్యే వరకు ఆస్పత్రి సూపరిండెంట్ డా.విజయలక్ష్మిని కలెక్టర్ కు సరెండర్ చేశారు. అయితే ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. సస్పెన్షన్ తో సరిపెట్టకుండా ఘటనపై పూర్తిస్థాయి విచారణకు అదేశించినట్టుగా సమాచారం. అందులో భాగంగా డిఎంఈ నుంచి సంగారెడ్డికి చెందిన డా. అనిల్ బృందం జిల్లా ఆస్పత్రిలో విచారణ చేపట్టింది. ఆస్పత్రిలోని ఐసీయూను బృందం పరిశీలించింది. ఆస్పత్రి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకుంది. ఎలుకలు రాకుండా ఉండేందుకు తీసుకునే చర్యల గురించి వివరాలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆస్పత్రిలో ఎలుకలు రావడానికి గల కారణాలను అన్వేషించినట్టుగా సమాచారం. సానిటేశన్ విభాగాలను కూడా డిఎంఈ బృందం పరిశీలించారు.
సత్యం న్యూస్, కామారెడ్డి