హిందీ మాట్లాడని రాష్ట్రాలపై హిందీ రుద్దాలని కేంద్రంలోని పెద్దలు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఇది అదనుగా తీసుకుని ఉత్తరాది రాష్ట్రాలలోని వేరే ప్రాంతాల నుంచి వచ్చిన అధికారులపై హిందీ నేర్చుకోమని స్థానిక ప్రజాప్రతినిధులు వత్తిడి తీసుకువస్తున్న ఘటనలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లోని మహారాజ్గంజ్ ప్రాంతానికి చెందిన సోహ్గి బార్వా వైల్డ్లైఫ్ డివిజన్లో జంగిల్ సఫారీని ప్రారంభించేందుకు ఆ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అరుణ్ సక్సేనా వచ్చారు.
కార్యక్రమంలో జిల్లా డీఎఫ్వో పుష్ప్కుమార్ హిందీయేతరుడు (దక్షిణాది రాష్ట్రాలకు చెందినవాడు) కావడంతో ఆయన ఇంగ్లీష్ లో మాట్లాడారు. దీంతో స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ పటేల్ తీవ్ర మైన అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారి ఇంగ్లీష్ లో మాట్లాడటం పై సదరు ఎమ్మెల్యే అటవీ మంత్రి కి ఫిర్యాదు చేశారు. బిజెపి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ పటేల్ మాట్లాడుతూ తనకు ఇంగ్లీష్ రాదు, తన భార్య కూడా నిరక్షరాస్యురాలు.
ఇలాంటి అధికారులు ఇక్కడకు వచ్చి ఇంగ్లీష్ లో మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. మహారాజ్గంజ్ జిల్లా ఒక వెనుకబడిన ప్రాంతం. ఇక్కడ అంతా హిందీలోనే మాట్లాడుకుంటారు తప్ప ఇంగ్లీష్ అక్షరం ముక్క రాదు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యే చెప్పడంతో ఇప్పుడు ఆ ఎమ్మెల్యే వీడియో వైరల్ అయింది. ఎమ్మెల్యే ఫిర్యాదుతో డీఎఫ్వో మాట్లాడుతూ తనను హిందీలో మాట్లాడాల్సిందిగా బీజేపీ ఎమ్మెల్యే ఒత్తిడి తెస్తున్నారన్నారు. తనకు హిందీ రాదని అందువల్ల ఇంగ్లీష్ లోనే మాట్లాడతానని ఆయన స్పష్టం చేశారు.