ఉమ్మడి జిల్లాలో టిఆర్ఎస్ ను ఈసారి పది స్థానాల్లో గెలిపిస్తామని, అందుకు అంతా ఐక్యతతో పనిచేస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రాజ్యసభ సభ్యులుగా నియమితులైన పారిశ్రామికవేత్త డాక్టర్ బండి పార్థసారధి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర కృతజ్ఞతా సభ శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య అధ్యక్షతన సత్తుపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సాగింది. ఈ సభకు వుమ్మడి జిల్లాలోని టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు పాల్గొనగా, పువ్వాడ మాట్లాడుతూ బిజెపి వంటి విచ్ఛిన్నకర శక్తులు కొన్ని అభివృద్ధి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు,బిజెపిలో చేరని వాళ్లపై కక్షపూరిత కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు ఆరోపించారు. ఈడీ పేరుతో భయంకు గురి చేయడంపై మండిపడ్డారు . ఖమ్మం అంటే పోరాటాల జిల్లా అనే విషయం బిజెపి నాయకులు తెలుసుకోవాలన్నారు. మతతత్వ బిజెపి బలపడటానికి కాంగ్రెస్ చర్యలే కారణమని దుయ్యబట్టారు. ప్రతిపక్ష పార్టీ హోదాలో కాంగ్రెస్ విఫలమైందని ఆరోపించారు.
ఎన్నికలు జరుగుతున్న గుజరాత్ రాష్ట్రంలో యాత్ర జరపకుండా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ యాత్ర నిర్వహించటం కాంగ్రెస్ చేతకానితనానికి నిదర్శనమని విమర్శించారు. రాష్ట్రమంతా మేమే గెలుస్తామని ప్రకటనలు చేస్తున్న బిజెపికి ఖమ్మం జిల్లాలోని 10 స్థానాల్లో ఎక్కడా డిపాజిట్లు రావని అన్నారు . ఖమ్మం జిల్లా పై ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక అభిమానం ఉందన్నారు. అడిగిన నిధులిస్తూ అదనంగా రెండు రాజ్యసభ స్థానాలు కూడా కేటాయించినట్లు తెలిపారు. ఖమ్మం జిల్లాలో జరిగిన అభివృద్ది ప్రజలకు తెలియచేసి మద్దతు కోరతామన్నారు. ఈ సందర్భంగా నేతలను సండ్ర నేతృత్వంలో సన్మానం చేశారు. కాగా ఈ సభకు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు రాకపోవటంపై చర్చ జరుగుతున్నది.