రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వారి అవసరాలను గుర్తించి వారు అభివృద్ధి చెందాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం పైనంపల్లిలో ఎర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మేల్యే కందాల ఉపేందర్ రెడ్డి , ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధుతో కలిసి మంత్రి పువ్వాడ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ దేశంలో సుస్థిరమైన వ్యవసాయం, సుస్థిరమైన రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం నిలిచిందని అందుకు ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాల ఫలితంగానే ఇది సాధ్యమైందన్నారు.
ఖమ్మం జిల్లాలో అత్యధికంగా పాలేరు, వైరా, మధిర సత్తుపల్లి నియోజకవర్గాల్లో ఎన్ఎస్పి ఆయకట్టు కింద అత్యధికంగా వరి పండించడం జరుగుతుందన్నారు. ఖమ్మం జిల్లాలో అత్యధికంగా వారి సాగు అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అందుకు తగ్గ ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఏక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతున్నలకు అన్ని వసతులు, సౌకర్యాలు కల్పించడం జరిగిందని, గన్ని బ్యాగ్స్, రవాణా ఇతరత్ర సౌకర్యాలు అందుబాటులో ఉంచామన్నారు. గడచిన రెండేళ్లుగా కోవిడ్ కారణంగా రైతుల నుండి ఆఖరి గింజ వరకు కొని వారి వారి బ్యాంక్ అకౌంట్ లలో నగదును జమచేసి వారిని అదుకున్నామని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో 40 లక్షల మెట్రిక్ టన్నులు పండించడం గగనం.. అలాంటిది ఇపుడు 1.40 కోట్ల మెట్రిక్ టన్నుల దిగుబడి సాధించే స్థాయికి చేరామని, అందుకు ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాలే కారణమన్నారు.
టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తున్నారని తెలిపారు. రైతులకు కోసం ఏర్పాటు చేసిన ఈ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లాలో గతంలో కంటే వరి సాగు విస్తీర్ణం చాలా పెరిగిందన్నారు. ఈ సీజన్ లో 2.89 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారని, 6.66 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారని ఆయా కొనుగోలు కోసం జిల్లా వ్యాప్తంగా మొత్తం 220 కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, అవసరం మేరకు మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.